...
...
Next Story

జర్మనీలో మిన్నంటిన భారతీయుల దేశభక్తి: మాన్‌హైమ్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

జర్మనీలోని మాన్‌హైమ్‌లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 70 మందికి పైగా చిన్నారులు భారత పటం ఆకారంలో నిలబడి దేశభక్తిని చాటుకోగా, 'యక్ష ధ్రువ యూరప్' బృందం ప్రదర్శించిన యక్షగానం ఈ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.

Published on: Jan 28, 2026, 06:28:00 IST
Advertisement

జర్మనీలోని మాన్‌హైమ్‌ నగరం భారతీయతతో పులకించిపోయింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక 'ఇంటర్ కల్చరల్ హౌస్ ఆఫ్ మాన్‌హైమ్' (IKHM) వేదికగా ప్రవాస భారతీయులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వరుసగా మూడో ఏడాది కూడా అదే ఉత్సాహంతో మన రాజ్యాంగ ఆవిర్భావాన్ని, భారతీయ ప్రజాస్వామ్య విలువలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వణుకుతున్న చలిలోనూ

జర్మనీలో మిన్నంటిన భారతీయుల దేశభక్తి: మాన్‌హైమ్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
జర్మనీలో మిన్నంటిన భారతీయుల దేశభక్తి: మాన్‌హైమ్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

ఈ వేడుకల్లో చిన్నారుల ప్రదర్శన అందరినీ కదిలించింది. మన్‌హైమ్, చుట్టుపక్కల నగరాల నుంచి వచ్చిన 70 మందికి పైగా చిన్నారులు, వివిధ భారతీయ రాష్ట్రాల వేషధారణలో ఒకే చోట చేరి 'భారత దేశ పటం' (India Map) ఆకారంలో నిలబడ్డారు. జర్మనీలో గడ్డకట్టే చలి ఉన్నప్పటికీ, వారిలో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన ఈ దృశ్యాలు భారత మాతపై వారికున్న ప్రేమాభిమానాలను ప్రతిబింబించాయి.

ఘనంగా జెండా ఆవిష్కరణ

మ్యూనిచ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కాన్సుల్ అభినవ్ కుమార్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. IKHM ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు అపర్ణ సుద్దపల్లి, ప్రదీప్ కుమార్ జైన్, అంకిత్ జైన్, అర్పిత్ జైన్‌ల నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో Mannheim పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భారతీయ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

మేధస్సుకు పదును.. సంస్కృతికి అద్దం

స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర పోరాట ఘట్టాలపై నిర్వహించిన క్విజ్ పోటీలు ప్రేక్షకులను అలరించాయి. సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. వివిధ రాష్ట్రాల సంస్కృతులను చాటిచెప్పే నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి. ప్రవాసంలో ఉన్నప్పటికీ భారతీయ వారసత్వాన్ని కాపాడుకోవడం, దేశ గౌరవాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వక్తలు గుర్తుచేశారు.

ప్రత్యేక ఆకర్షణగా 'యక్షగానం'

మంగళూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు సతీష్ శెట్టి పట్ల స్థాపించిన 'యక్ష ధ్రువ పట్ల ఫౌండేషన్' నేడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, స్టుట్‌గార్ట్, మ్యూనిచ్‌ వంటి నగరాలతో పాటు నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లోనూ తన శాఖలను విస్తరించింది. ప్రస్తుతం 40 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, కన్నడ, కొంకణి, తులు, ఇంగ్లీష్ భాషల్లో ఇప్పటివరకు 40కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, త్వరలోనే ప్రపంచంలోనే తొలిసారిగా జర్మన్ భాషలో యక్షగాన ప్రదర్శన ఇవ్వడానికి ఈ బృందం సిద్ధమవుతుండటం విశేషం.

చిన్నారులు భారత పటం ఆకారంలో నిలబడి దేశభక్తిని చాటుకున్నారు

నిర్వాహకులు, వాలంటీర్ల నిరంతర కృషితో ఈ గణతంత్ర వేడుకలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. చివరగా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe