భారత్-ఈయూ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఖరారు: త్వరలోనే సంతకాలు

భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఇరు పక్షాలకు మేలు చేసేలా ఈ డీల్ ఖరారైందని, త్వరలోనే అధికారికంగా సంతకాలు జరుగుతాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. ఇది ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది.

Published on: Jan 26, 2026 8:14 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇరు పక్షాల మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, ఒప్పందం దాదాపు ఖరారైందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.

ఈయూ కమిషన్ అధ్యక్షురాలికి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Photo: PMO)
ఈయూ కమిషన్ అధ్యక్షురాలికి స్వాగతం పలుకుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Photo: PMO)

వ్యాపార సామ్రాజ్యానికి కొత్త ఊపు

"చర్చలు సఫలమయ్యాయి.. డీల్ ఫైనల్ అయింది. భారత కోణంలో చూస్తే ఇది ఎంతో సమతుల్యమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఒప్పందం. దీనివల్ల యూరోపియన్ దేశాలతో మన ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది" అని రాజేష్ అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఈ ఒప్పంద పత్రానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల పరిశీలన (Legal scrubbing) జరుగుతోందని, ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒప్పందంపై సంతకాలు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా ఇరు ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు వెల్లువెత్తడమే కాకుండా, వాణిజ్య రంగానికి భారీగా ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా సంతకాలు పూర్తయితే, వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

భారత గణతంత్ర వేడుకల్లో ‘ఈయూ’ సందడి

మరోవైపు, భారత్-ఈయూ మధ్య బంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా రక్షణ, భద్రతా రంగాల్లోనూ విస్తరిస్తోంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరవడం విశేషం.

ఈ సందర్భంగా యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కల్లాస్ మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే గొప్ప అవకాశం తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. "భారత్‌తో సన్నిహిత సహకారం కోసం మా దగ్గర బలమైన ప్రణాళికలు ఉన్నాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈయూ నౌకాదళ విభాగాలు 'అట్లాంటా', 'ఆస్పైడ్స్' సిబ్బంది తొలిసారిగా పరేడ్‌లో పాల్గొనడం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహానికి నిదర్శనం" అని ఆమె పేర్కొన్నారు.

భద్రతపై కీలక ఒప్పందం

సమ్మిట్‌లో భాగంగా మంగళవారం భారత్-ఈయూ మధ్య రక్షణ, భద్రతా భాగస్వామ్యంపై సంతకాలు జరగనున్నాయి. దీని ద్వారా సైబర్ భద్రత, సముద్ర భద్రత (Maritime security), ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనపై స్పందిస్తూ.. యూరోపియన్ దేశాల నేతలకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవమని, ఈ పర్యటన భారత్-ఈయూ భాగస్వామ్య బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని అన్నారు. 2026 గణతంత్ర వేడుకలు కేవలం ఉత్సవాలుగా మాత్రమే కాకుండా భారత్, యూరప్ దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసిన మైలురాయిగా నిలిచిపోనున్నాయి.