India vs Ireland : ఈరోజు నుంచే భారత్- ఐర్లాండ్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ డౌటే!
India vs Ireland 2026 T20I series : బెల్ఫాస్ట్ వేదికగా నేడు ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అందరి ఫోకస్ 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. కానీ అతను ఆడటం డౌట్గానే ఉంది.
టీ20 ప్రపంచకప్ 2026ని కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు భవిష్యత్తు లక్ష్యాల వైపు అడుగులు వేస్తోంది. 2028లో జరగబోయే తదుపరి టీ20 వరల్డ్ కప్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్కు బలమైన జట్టును సిద్ధం చేసే పనిని బీసీసీఐ ఇప్పుడే ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. ఐర్లాండ్తో 2 మ్యాచుల టీ20 సిరీస్ నేడు ప్రారంభంకానుంది. బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా.. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా అందరి ఫోకస్ యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. కానీ అతని అరంగేట్రంపై సస్పెన్స్ నెలకొంది.

సూర్యకుమార్ అవుట్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్!
ఈ పర్యటన కోసం భారత్ దాదాపు పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టును ఎంపిక చేసింది. ప్రపంచకప్ నెగ్గిన జట్టు నుంచి అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి కొద్దిమంది తెలిసిన ముఖాలు మాత్రమే ఈ సిరీస్లో ఆడుతున్నారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న సూర్య.. జట్టులో స్థానంతో పాటు కెప్టెన్సీని కూడా కోల్పోయాడు.
గత మూడు సీజన్లుగా ఐపీఎల్లో కెప్టెన్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన శ్రేయస్ అయ్యర్కు సెలెక్టర్లు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించారు. యువ ఆటగాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2026, టీ20 ప్రపంచకప్లకు దూరమైన స్పీడ్స్టర్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి ప్రవేశించాడు.
మరోవైపు, ఐర్లాండ్ జట్టు కూడా సరికొత్త కెప్టెన్ లోర్కాన్ టక్కర్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది.
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్!
ఈ సిరీస్లో యువ సంచలనం, 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కేవలం ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటికే నిలకడగా రాణిస్తున్న పాత ఆటగాళ్లను పక్కన పెట్టడం అన్యాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
"భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కొత్త వాళ్లు రావడం వల్ల జట్టులో ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది. అయితే కేవలం ఒకరికి అవకాశం ఇవ్వడానికే పరుగులు చేస్తున్న మరొకరిని డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు. సూర్యవంశీ అరంగేట్రంపై టీమ్ మీటింగ్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు కలిసి తుది నిర్ణయం తీసుకుంటారు," అని కోటక్ వెల్లడించారు.
ఇండియా వర్సెస్ ఐర్లాండ్- లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు..
భారతదేశంలో ఈ సిరీస్ ప్రసార హక్కులను 'సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్' సొంతం చేసుకుంది.
టీవీ ఛానళ్లు: సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5 (ఇంగ్లీష్), సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తెలుగు, తమిళం, మలయాళం) ఛానళ్లలో మ్యాచ్లు లైవ్ వస్తాయి.
డిజిటల్ స్ట్రీమింగ్: మొబైల్ లేదా స్మార్ట్ టీవీల్లో చూడాలనుకునే వారు 'SonyLIV' యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
ఇండియా వర్సెస్ ఐర్లాండ్- ఇరు జట్ల స్క్వాడ్లు..
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ శెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
ఐర్లాండ్ జట్టు: లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, మాథ్యూ హోలార్డ్, లియామ్ మెక్కార్తీ, జై మూంద్రా, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, రూబెన్ విల్సన్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


