India T20 squad : కెప్టెన్​గా శ్రేయస్ అయ్యర్, వైభవ్​ సూర్యవంశీ గ్రాండ్​ ఎంట్రీ- మన టీ20 జట్టు ఇదే..

India T20 team : ఐర్లాండ్, ఇంగ్లాండ్​ టూర్లకు సంబంధించిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుండగా, జట్టులోకి వైభవ్​ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడు. తన ఎంట్రీతో.. 36ఏళ్ల పాటు సచిన్ పేరిట ఉన్న రికార్డును సూర్యవంశీ చెరిపేశాడు.

Published on: Jun 6, 2026, 13:23:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్‌లో మరో కొత్త శకం ప్రారంభమైంది! టీమిండియా టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల్లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. స్టార్ బ్యాటర్, 2024 టీ20 వరల్డ్​ కప్​ విన్నింగ్​ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​ని తప్పించి, శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా చేసింది. ఈ నెల చివర్లో జరగబోయే ఐర్లాండ్ పర్యటనతో పాటు జులైలో జరిగే ఇంగ్లాండ్ టూర్, అలాగే సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్​కి శ్రేయస్ అయ్యర్ భారత జట్టును నడిపించనున్నారు.

టీమిండియా టీ20 కెప్టెన్​గా శ్రేయస్ అయ్యర్..
టీమిండియా టీ20 కెప్టెన్​గా శ్రేయస్ అయ్యర్..

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమక్షంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ పర్యటనలకు సంబంధించిన జట్లను శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఒక ఐసీసీ టైటిల్ గెలిచిన ఏడాది లోపే భారత కెప్టెన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించగా.. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచే కాకుండా, ఏకంగా జట్టు నుంచే సెలెక్టర్లు పక్కన పెట్టేశారు!

36 ఏళ్ల సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. 15 ఏళ్ల కుర్రాడి ఎంట్రీ!

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానం ఒక చారిత్రాత్మక మార్పుతో మొదలుకాబోతోంది. భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికైన వైభవ్.. టీమిండియా చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీనితో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న సుదీర్ఘ రికార్డు బద్దలైపోయింది! సచిన్ టెండూల్కర్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. ఇప్పుడు కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డును తిరగరాయడానికి సిద్ధమయ్యాడు.

ఈ ఎడమచేతి వాటం యువ బ్యాటింగ్ సంచలనం ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించాడు. ఏకంగా 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలవడమే కాకుండా.. అత్యంత చిన్న వయసులో ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ పాత రికార్డును కూడా ఈ కుర్రాడు చెరిపేసాడు. ప్రస్తుతం ఇండియా-ఏ తరపున శ్రీలంక-ఏ, ఆఫ్ఘానిస్థాన్-ఏ జట్లతో తలపడేందుకు సిద్ధమవుతున్న వైభవ్.. అదే భీకర ఫామ్‌ను సీనియర్ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా?

సూర్యకుమార్ యాదవ్ మళ్లీ నీలి రంగు జెర్సీలో భారత్ తరపున బరిలోకి దిగడం ఇక కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఫామ్ ఆశించినంతగా లేదు. దీనికి తోడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఘోరంగా విఫలం కావడం అతని కెరీర్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. 2025లో భారత్ తరపున ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ ఆయన కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. సూర్య నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచినప్పటికీ.. వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మినహా, ఈ సీనియర్ బ్యాటర్ టోర్నీ అంతటా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

మరోవైపు, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ 2025లో 600కు పైగా పరుగులు చేసిన ఆయన, ఐపీఎల్ 2026లోనూ దాదాపు 500 పరుగులు సాధించారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్​ని ఛాంపియన్‌గా నిలపడమే కాకుండా, మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు నడిపించారు. టీ20 లైనప్‌లో నాలుగో స్థానంలో సూర్యకుమార్ స్థానాన్ని శ్రేయస్ భర్తీ చేయనున్నారు. రాబోయే నెలల్లో ఈ కొత్త బాధ్యతను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడటం ఆసక్తికరంగా మారనుంది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్లు ఇవే..

ఐర్లాండ్ సిరీస్ (రెండు టీ20లు) భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.

ఇంగ్లాండ్ సిరీస్ (ఐదు టీ20లు) భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.

ఏషియన్ గేమ్స్​ భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More