Sonam Wangchuk : ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’- ప్రజలకు సోనమ్ వాంగ్చుక్ లేఖ!
నిర్భంధం నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్ రాసిన ఒక చేతిరాత లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
నీట్ యూజీ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో జరుగుతున్న వరుస అవకతవకలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారంటూ సోనమ్ వాంగ్చుక్ రాసిన ఒక చేతిరాత లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఆయన భార్య గీతాంజలి ఈ లేఖను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
"ఇది దేశంలో భయానికి, అన్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న 'రెండో స్వాతంత్య్ర పోరాటం'. జులై 20 (సోమవారం) నాడు జరగబోయే పార్లమెంట్ మార్చ్కు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలి," అని వాంగ్చుక్ ఆ లేఖలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ పోరాటానికి మద్దతుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం తెల్లవారుజామున దిల్లీ పోలీసులు బలవంతంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో రోజుకు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలని దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఆయనను ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెబుతున్నారు. అయితే, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారని, నిరసనకారులపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తాను కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు విదేశాల నుంచి ఇటీవల తిరిగి వచ్చిన అభిజీత్ ప్రకటించారు.
కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..
సోనమ్ వాంగ్చుక్ను ధర్నా స్థలి నుంచి బలవంతంగా తొలగించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వ్యక్తిని ఆసుపత్రి పాలు చేయడం దుర్మార్గమంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.
"మోదీ ప్రభుత్వానికి పునాదులే అసత్యం, హింస. జంతర్ మంతర్ వద్ద అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ జీని అక్కడి నుంచి బలవంతంగా తరలించడం ముమ్మాటికీ తప్పిదమే. దేశ భవిష్యత్తుకు సంబంధించిన పేపర్ లీక్లు, విపరీతంగా పెరుగుతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత కీలకమైన సమస్యలు. ఎంతటి బలప్రయోగాన్నైనా ఉపయోగించి అణచివేయాలని చూసినా, భారతదేశ విద్యార్థులను, వారిని నమ్మే మాలాంటి వారిని ఈ ప్రశ్నలు అడగకుండా ఆపలేరు," అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మరోవైపు, కొత్త దిల్లీ పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే.. వాంగ్చుక్ తరలింపు చర్య తీసుకోవడం వెనుక రాజకీయం దాగి ఉందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాంగ్చుక్ భార్య గీతాంజలి కూడా ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, తమ అనుమతి లేకుండా ఎలాంటి వైద్యం అందించవద్దని లేఖ రాశారు. మెడికల్ రిపోర్టులలో పారదర్శకత లేదని, ఆయనను తక్షణమే డిశ్చార్జ్ చేసి తమకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకుంటామని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


