IPL 2026 DC vs PBKS : పంజాబ్ పై ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసం - 152 పరుగులతో కేఎల్ రాహుల్ సునామీ, సరికొత్త రికార్డు..!
IPL 2026 Delhi Capitals vs Punjab Kings : ఐపీఎల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు… పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల రికార్డు స్కోరు సాధించారు. కేఎల్ రాహుల్ 152 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
IPL 2026 Delhi Capitals vs Punjab Kings : ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారుతోంది. మైదానంలోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ బ్యాటర్లు రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.
ఢిల్లీ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంలో విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ చివరి వరకు ఏ దశలోనూ ఢిల్లీ వికెట్ల పతనాన్ని నియంత్రించలేకపోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగిన పంజాబ్.. పరుగుల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. మైదానంలో ఫీల్డింగ్ తప్పిదాలు కూడా పంజాబ్కు శాపంగా మారాయి.
కేఎల్ రాహుల్ కొత్త రికార్డ్
పంజాబ్ కింగ్స్పై ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్: 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్లు) విధ్వంసకర సెంచరీతో అదరగొట్టాడు. అతడికి తోడుగా నితీశ్ రాణా (91: 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
తొలి ఓవర్ నుంచే రాహుల్ దూకుడుగా ఆడాడు. క్రీజులో పాతుకుపోయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో పాటు వినూత్నమైన హిట్టింగ్తో స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఒకానొక దశలో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
- ఐపీఎల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు((152) సాధించిన బ్యాటర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో క్రిస్ గేల్ (175*), బ్రాండన్ మెక్కల్లమ్ (158*) ముందున్నారు.
- ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
- ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు.
- కేఎల్ రాహుల్ ఖాతాలో ప్రస్తుతం 5,579 పరుగులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (8,989) టాప్లో ఉన్నాడు.
ఇక పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 265 పరుగులు చేయాల్సి ఉంది. ఇది టీ20 ఫార్మాట్లో అత్యంత భారీ లక్ష్యం. పంజాబ్ బ్యాటింగ్ లైనప్లో హిట్టర్లు ఉన్నప్పటికీ…. ఇంత పెద్ద స్కోరును ఛేజ్ చేయడం అంటే అద్భుతం జరగాల్సిందే…! ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు ఓటమి ఎరగని జట్టుగా పంజాబ్ టాప్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి…!
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

