RCB sold : ఐపీఎల్ చరిత్రలో రికార్డు డీల్! రూ. 16,000 కోట్లకు అమ్ముడుపోయిన ఆర్సీబీ..

RCB IPL : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,000 కోట్లు) కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ సైతం భారీ ధరకు అమ్ముడైంది.

Published on: Mar 25, 2026, 08:10:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్‌లోని అత్యంత పాపులర్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది! ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బ్లాక్‌స్టోన్'లతో కూడిన కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (రూ. 16,000 కోట్ల కన్నా అధికం) ఆర్సీబీని దక్కించుకుంది. ఒక క్రికెట్ జట్టుకు ఈ స్థాయిలో వాల్యూయేషన్ రావడం ఇదే మొదటిసారి.

రికార్డు ధరకు ఆర్సీబీ విక్రయం..
రికార్డు ధరకు ఆర్సీబీ విక్రయం..

ఈ డీల్‌లో భాగంగా ఆర్సీబీ పురుషుల జట్టుతో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్​) జట్టును కూడా 100 శాతం వాటాతో ఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. డయాజియో పీఎల్‌సీకి చెందిన 'యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్' చేపట్టిన వ్యూహాత్మక సమీక్షలో భాగంగా ఈ విక్రయం జరిగింది.

ప్రారంభంలో ఈ జట్టు ధర 2 బిలియన్ డాలర్లుగా నిర్ణయించినప్పటికీ, చివరకు 1.78 బిలియన్ డాలర్ల వద్ద డీల్ కుదిరింది.

ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. "గత రెండు దశాబ్దాలలో ఐపీఎల్ ప్రపంచ క్రీడా రంగంలోనే ఒక పవర్‌హౌస్‌గా ఎదిగింది. అత్యంత ఆకర్షణీయమైన ఫ్రాంచైజీలలో ఒకటైన ఆర్సీబీకి సంరక్షకులుగా మారడం మాకు గర్వకారణం," అని పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఈ ఫ్రాంచైజీకి ఛైర్మన్‌గా, టైమ్స్ గ్రూప్‌కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

అంతర్జాతీయ ఇన్వెస్టర్ల క్యూ..

ఆర్సీబీని కొనుగోలు చేసిన కన్సార్టియంలోని బోల్ట్ వెంచర్స్ అధినేత డేవిడ్ బ్లిట్జర్‌కు ఇప్పటికే క్రిస్టల్ ప్యాలెస్ (ఈపీఎల్​), ఫిలడెల్ఫియా 76ers (ఎన్​బీఏ) వంటి ప్రపంచ ప్రఖ్యాత జట్లలో వాటాలు ఉన్నాయి. అలాగే బ్లాక్‌స్టోన్ సంస్థకు ఇదే మొదటి స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్.

రాజస్థాన్ రాయల్స్ కూడా భారీ ధరకే..

కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్​) సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అరిజోనాకు చెందిన టెక్ ఎంట్రప్రెన్యూర్ కల్ సోమాని నేతృత్వంలోని బృందం 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,000 కోట్లు) ఈ జట్టును కొనుగోలు చేసింది. ఈ ఇన్వెస్టర్ల బృందంలో వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్, ఫోర్డ్, ఫైర్‌స్టోన్ కుటుంబాలకు చెందిన షీలా ఫోర్డ్ హాంప్ వంటి దిగ్గజాలు ఉండటం విశేషం.

రాజస్థాన్ రాయల్స్ కొనుగోలుదారు కల్ సోమాని ఇప్పటికే గ్లాస్గోలోని టోమారో గోల్ఫ్ లీగ్ (టీజీఎల్​)లో పెట్టుబడులు పెట్టారు. మనోజ్ బదాలే తన 65% వాటాను విక్రయించగా, గతంలో ఇందులో వాటా తీసుకున్న రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఈ డీల్ ద్వారా 6 రెట్లు లాభాన్ని ఆర్జించింది.

కాగా ఈ రెండు ఒప్పందాలకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, రెగ్యులేటరీ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది.

పెరుగుతున్న ఐపీఎల్ క్రేజ్..

2021లో ఐపీఎల్ విస్తరణ సమయంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ఉమ్మడి ధర 1.6 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో జట్టు విలువే అంతకంటే ఎక్కువగా ఉండటం ఐపీఎల్ ఎదుగుదలకు నిదర్శనం.

సౌరవ్ గంగూలీ స్పందన..

ఈ భారీ ఒప్పందాలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశారు.

"ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో నేనే మొదటి బంతిని ఆడాను. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ విలువ కేవలం 67 మిలియన్ డాలర్లు. ఈ స్థాయికి ఐపీఎల్ చేరుకోవడం అద్భుతం. అమెరికా వంటి దేశాల నుంచి ఇన్వెస్టర్లు రావడం భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది," అని ఆయన అన్నారు.

అయితే, గత రెండేళ్లలో ఐపీఎల్ మొత్తం బ్రాండ్ విలువ కొంత తగ్గుముఖం పట్టినట్లు (2023లో 11.2 బిలియన్ డాలర్ల నుంచి గత ఏడాది 8.8 బిలియన్ డాలర్లకు) రిపోర్టులు చెబుతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లపై నిషేధం, మీడియా హక్కుల విలీనం దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ.. తాజా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ డీల్స్ రాబోయే మీడియా హక్కుల వేలం (2028-32)పై భారీ ఆశలు రేకెత్తిస్తున్నాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. ఆర్సీబీ కొత్త యాజమాన్యంలో ఎవరెవరు ఉన్నారు? ఈ డీల్ విలువ ఎంత?

ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని ఒక శక్తివంతమైన కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు, ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ డీల్ విలువ సుమారు $1.78 బిలియన్లు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టుకు లభించిన అత్యధిక వాల్యూయేషన్ ఇదే కావడం విశేషం.

2. ఈ కొత్త ఒప్పందంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్​) జట్టు కూడా భాగమేనా?

అవును, ఈ డీల్ ద్వారా ఆర్సీబీ ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను కొత్త యాజమాన్యం దక్కించుకుంది. ఇందులో ఐపీఎల్ (పురుషుల జట్టు)తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడే RCB-W జట్టు కూడా ఉంది. అంటే భవిష్యత్తులో ఈ రెండు జట్ల నిర్వహణ బాధ్యతలు, బ్రాండింగ్, నిర్ణయాలన్నీ ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కొత్త బోర్డు పరిధిలోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More