RCB vs CSK: అదేం బాదుడు సామి.. చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ.. చెన్నైపై బెంగళూరు ఘనవిజయం.. కోహ్లి ఖాతాలో మరో రికార్డు
RCB vs CSK: ఏమా బ్యాటింగ్.. ఏమా బౌండరీల విధ్వంసం! సింగిల్స్ తీయడం కంటే సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్లు ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ ను ఉతికి ఆరేశారు.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మామూలుగా ఆడటం లేదు. ఛాంపియన్ టీమ్ లాగే చెలరేగిపోతోంది. బ్యాటింగ్ లో విధ్వంసంతో రికార్డులు తిరగరాస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సిక్సర్లతో చెలరేగిన ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది.

ఆర్సీబీ విక్టరీ
ఐపీఎల్ 2026లో ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అదరగొట్టింది. 43 రన్స్ తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 250 రన్స్ చేసింది. ఛేజింగ్ లో చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
చిన్నస్వామిలో సునామీ
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో ఆర్సీబీ చూపించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు సిక్సర్లతో చెలరేగిపోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (46), విరాట్ కోహ్లి (28) టీమ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దేవ్ దత్ పడిక్కల్ (50)తో రాణించాడు.
సిక్సర్ల మోత
అయితే ఫిల్ సాల్ట్ వికెట్ పడే సమయానికి 10.4 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 93 మాత్రమే. ఇంకా 100 కూడా దాటలేదు. అలాంటి టీమ్ చివరకు 250 రన్స్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 నాటౌట్), కెప్టెన్ రజత్ పటీదార్ (19 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 48 నాటౌట్) విధ్వంసమే.
టిమ్ డేవిడ్, రజత్ మామూలుగా చెలరేగలేదు. సింగిల్స్ తీయడం కంటే సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్లు వీళ్ల బ్యాటింగ్ సాగింది. బాల్ ను స్టాండ్స్ లోకి పంపిస్తూ చిన్నస్వామి స్టేడియాన్ని వీళ్లు ఊపేశారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ మామూలుగా బాదలేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతను కొట్టిన ఓ బాల్ స్టేడియం బయటకు వెళ్లింది.
చెన్నై ఇలా
కొండంత రన్ ఛేజింగ్ లో సీఎస్కేకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్ (9), కెప్టెన్ రుతురాజ్ (7), ఆయూష్ మాత్రె (1) ఫెయిల్ అయ్యారు. దీంతో సీఎస్కే పుంజుకోలేకపోయింది. సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), ప్రశాంత్ వీర్ (43) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
కోహ్లి రికార్డు
రన్ మెషిన్ విరాట్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఓ టీమ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీఎస్కేపై కోహ్లి 37 మ్యాచ్ ల్లో 1188 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ (కేకేఆర్ పై 1161) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.
మరోవైపు ఐపీఎల్ సీఎస్కేపై అత్యధిక స్కోరు రికార్డును ఆర్సీబీ ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన టీమ్ గానూ నిలిచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












