IPL 2026 RR vs MI : అర్చర్‌ ఆల్‌రౌండ్ షో.... ముంబైపై సూపర్ విక్టరీ..! ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్

IPL 2026 RR vs MI : ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో చివరి స్థానాన్ని దక్కించుకుంది. బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడనుంది.

Published on: May 24, 2026, 20:48:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026 RR vs MI : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వాంఖెడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన కీలక పోరులో జోఫ్రా ఆర్చర్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరవడంతో ముంబై ఇండియన్స్‌ (MI) పై రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ప్లేఆఫ్స్‌కు రాజస్థాన్
ప్లేఆఫ్స్‌కు రాజస్థాన్

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో పట్టికలో పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు) ను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో రాజస్థాన్ రాయల్స్ తలపడటం ఖరారైంది. మరోవైపు ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను 9వ స్థానంతో (4 విజయాలు, 10 ఓటములు) నిరాశాజనకంగా ముగించింది.

టాప్ ఆర్డర్ విఫలమైనా.. ఆర్చర్ సూపర్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17 బంతుల్లో 27), కెప్టెన్ రియాన్ పరాగ్ (14), వైభవ్ సూర్యవంశీ (4) త్వరగానే అవుట్ కావడంతో రాజస్థాన్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో ధ్రువ్ జురెల్ (26 బంతుల్లో 38), దాసున్ శనక (15 బంతుల్లో 29) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్ కేవలం 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరలో రవీంద్ర జడేజా (19 నాటౌట్), నాండ్రే బర్గర్ (10 నాటౌట్) కేవలం 12 బంతుల్లో 30 పరుగులు జోడించడంతో రాజస్థాన్ 200 మార్కును దాటింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

సూర్య, హార్దిక్ పోరాడినా దక్కని ఫలితం

206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ ధాటికి ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, నమన్ ధీర్ (6), ర్యాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో ముంబై 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), విల్ జాక్స్ (33) కలిసి 50 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. విల్ జాక్స్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడుతూ సూర్యతో కలిసి ముంబై ఆశలను సజీవంగా ఉంచాడు.

15 ఓవర్లు ముగిసేసరికి ముంబై 147/5తో బలంగా కనిపించింది. కానీ, మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ఆర్చర్.. హార్దిక్ పాండ్యాను అవుట్ చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ కూడా బర్గర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో ముంబై పోరాటం ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో అదరగొట్టగా, బ్రిజేష్ శర్మ, బర్గర్, యశ్ రాజ్ పూంజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు:

  • రాజస్థాన్ రాయల్స్: 20 ఓవర్లలో 205/8 (ధ్రువ్ జురెల్ 38, జోఫ్రా ఆర్చర్ 32, శార్దూల్ ఠాకూర్ 2/41, దీపక్ చాహర్ 2/43)
  • ముంబై ఇండియన్స్: 20 ఓవర్లలో 175/9 (సూర్యకుమార్ యాదవ్ 60, హార్దిక్ పాండ్యా 34, జోఫ్రా ఆర్చర్ 3/17, బ్రిజేష్ శర్మ 2/26)
  • ఫలితం: 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.

ఈ విజయంతో ఆర్ఆర్ మొత్తం 16 పాయింట్లతో ఫ్లై ఆఫ్స్ కు చేరగా.. 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) రేసు నుంచి వైదొలిగింది. బుధవారం ముల్లన్ పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు గుజరాత్, బెంగళూరు కూడా ఫ్లైఆఫ్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More