...
...
Next Story

టీసీఎస్, ఇన్ఫోసిస్ బేజారు.. ఐటీ రంగంలో రూ. 1.3 లక్షల కోట్ల సంపద ఆవిరి, కారణాలివే

భారత ఐటీ రంగం నేడు భారీ పతనాన్ని మూటగట్టుకుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.6% క్షీణించడంతో ఒక్కరోజే రూ. 1.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తెస్తున్న మార్పులు, అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి ఈ అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణాలు.

Published on: Feb 12, 2026, 12:28:22 IST
Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోవడంతో ఐటీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక్కరోజే 4.6 శాతం పతనమై 33,471 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఐటీ ఇండెక్స్ విలువ రూ. 28.9 లక్షల కోట్ల నుంచి రూ. 27.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు రూ. 1.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్ బేజారు.. ఐటీ రంగంలో రూ. 1.3 లక్షల కోట్ల సంపద ఆవిరి, కారణాలివే (An AI-generated image)
టీసీఎస్, ఇన్ఫోసిస్ బేజారు.. ఐటీ రంగంలో రూ. 1.3 లక్షల కోట్ల సంపద ఆవిరి, కారణాలివే (An AI-generated image)

2026 ప్రారంభం నుంచి ఐటీ రంగానికి కాలం కలిసిరావడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐటీ ఇండెక్స్ సుమారు 11 శాతం నష్టపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే 12 శాతం మేర పతనం కావడం ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచుతోంది.

ఐటీ షేర్లు ఎందుకు పడిపోయాయి?

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఐటీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఏఐ (AI) భయాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న పెనుమార్పులు సాంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలకు సవాలుగా మారాయి. ముఖ్యంగా 'ఆంత్రోపిక్' (Anthropic) వంటి ఏఐ స్టార్టప్‌లు కొత్త టూల్స్ తీసుకురావడంతో, పాత సాఫ్ట్‌వేర్ పద్ధతులు కాలగర్భంలో కలిసిపోతాయనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ఇది ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై ప్రభావం చూపుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది.

"ఏఐ షాక్ నుంచి టెక్ స్టాక్స్ ఇప్పుడప్పుడే కోలుకోవడం కష్టమే. భారత ఐటీ రంగం మరికొంత కాలం ఇబ్బందులు పడే అవకాశం ఉంది" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

2. అమెరికా ఉద్యోగ గణాంకాలు - వడ్డీ రేట్లు: అమెరికాలో జనవరి నెల ఉద్యోగ గణాంకాలు ఆశించిన దానికంటే మెరుగ్గా వచ్చాయి. 70,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తే, ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు తగ్గకపోతే ఐటీ కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

నేటి ట్రేడింగ్‌లో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ నష్టాల బాట పట్టాయి:

  • టీసీఎస్ (TCS): ఈ కంపెనీ షేర్లు 4.5 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 2,776) కి చేరాయి.
  • కోఫోర్జ్ (Coforge): 5.5 శాతంతో అత్యధికంగా నష్టపోయింది.
  • ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTI Mindtree): 5 శాతం పైగా క్షీణించింది.
  • ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా: ఇవన్నీ 4 శాతానికి పైగా నష్టపోయాయి.
  • హెచ్‌సీఎల్ టెక్, ఎంఫాసిస్: ఇవి 2.5 నుంచి 4 శాతం మధ్య క్షీణించాయి.

టెక్నికల్ వ్యూ: ఐటీ ఇండెక్స్ ప్రస్తుతం 36,000 మార్కు కింద ట్రేడ్ అవుతోంది. ఇది సాంకేతికంగా బలహీనతను సూచిస్తోందని బోనాంజా టెక్నికల్ అనలిస్ట్ ధ్రుమిల్ విత్లానీ పేర్కొన్నారు. మార్కెట్ కోలుకునే సమయంలో షేర్లను విక్రయించడమే (Sell on rise) ప్రస్తుతానికి ఉత్తమ వ్యూహమని ఆయన సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe