JEE Mains Result 2026 Session 2 : ఇంకో రెండు రోజుల్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు!
JEE Mains Result 2026 Session 2 results : జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 20 లోపు ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్టీఏ సిద్ధమైంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇంకో రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 20వ తేదీ లోపు ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఫలితాల కోసం దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్ 20 లోపు ఫలితాల ప్రకటన..
ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ సెషన్-2 (పేపర్-1: బీఈ./ బీటెక్) ఫలితాలు ఏప్రిల్ 20 నాటికి వెలువడే అవకాశం ఉంది. ఈసారి అభ్యర్థుల రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్) ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, అందులో దేనిలో అయితే ఉత్తమ స్కోరు వచ్చిందో దాని ఆధారంగా తుది ర్యాంకులను కేటాయించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు తమ ఉత్తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2- భారీ స్థాయిలో హాజరైన అభ్యర్థులు..
ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగాయి. దేశవ్యాప్తంగా 304 నగరాల్లో, విదేశాల్లోని మరో 14 నగరాల్లో కలిపి మొత్తం 566 పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహించింది.
పేపర్ 1: సుమారు 11.06 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, దాదాపు 93 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
పేపర్ 2: సుమారు 54,953 మంది స్వదేశీ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 73 శాతం హాజరు నమోదైంది.
ఈసారి ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. సుమారు 97 శాతం మంది అభ్యర్థులకు విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తి చేసి పరీక్షకు అనుమతించడం విశేషం.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:
స్టెప్ 1- ముందుగా ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే 'JEE Mains Result 2026 Session 2' లింక్పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ (Login Details) నమోదు చేయండి.
స్టెప్ 4- సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీ స్కోర్ కార్డ్ స్క్రీన్పై కనిపిస్తుంది.
స్టెప్ 5- ఫలితాలను డౌన్లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.
తదుపరి ప్రక్రియ: జేఈఈ అడ్వాన్స్డ్
మెయిన్స్ ఫలితాల్లో టాప్ 2.5 లక్షల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ అడ్వాన్స్డ్' పరీక్షకు అర్హత సాధిస్తారు. కాబట్టి ఫలితాలు వచ్చిన వెంటనే అడ్వాన్స్డ్ పరీక్షకు సిద్ధమవ్వడం ఉత్తమం. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు ఆశించే వారు జోసా కౌన్సెలింగ్ ప్రక్రియపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సమాచారం ప్రకారం, ఫలితాలు ఏప్రిల్ 20, 2026 లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.
2. స్కోరును ఎలా లెక్కిస్తారు?
విద్యార్థి సెషన్ 1, సెషన్ 2.. ఈ రెండింటిలోనూ పాల్గొని ఉంటే, ఏ సెషన్లో ఎక్కువ మార్కులు (NTA Score) వస్తాయో దాన్నే తుది ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
3. ఫలితాల కోసం ఏ వెబ్సైట్ను చూడాలి?
అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్ అయిన jeemain.nta.nic.in లేదా nta.ac.in మాత్రమే సంప్రదించాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


