కళ్యాణ్ జ్యువెలర్స్: లాభంలో 90% వృద్ధి, షేర్ ధర 12% జంప్

అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో కళ్యాణ్ జ్యువెలర్స్ ఇన్వెస్టర్ల కళ్లలో ఆనందం నింపింది. మూడవ త్రైమాసికంలో (Q3) అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 12 శాతం మేర దూసుకెళ్లింది.

Published on: Feb 09, 2026 10:51 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబై: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు మార్కెట్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 9) ఉదయం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర దాదాపు 12 శాతం పెరిగి రూ. 424.85 వద్దకు చేరింది. గత ముగింపు ధర రూ. 379.80తో పోలిస్తే ఇది భారీ జంప్. గత ఏడాది కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ స్టాక్, తాజా ఫలితాల జోరుతో మళ్లీ కోలుకుంటోంది.

మూడవ త్రైమాసికంలో (Q3) అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడంతో సోమవారం ట్రేడింగ్‌లో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు 12 శాతం మేర దూసుకెళ్లింది (Photo: Pixabay )
మూడవ త్రైమాసికంలో (Q3) అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడంతో సోమవారం ట్రేడింగ్‌లో కళ్యాణ్ జువెల్లర్స్ షేరు 12 శాతం మేర దూసుకెళ్లింది (Photo: Pixabay )

లాభాల్లో భారీ వృద్ధి: క్యూ3 ఫలితాల హైలైట్స్

శుక్రవారం సాయంత్రం కంపెనీ ప్రకటించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించిపోయాయి.

  • నికర లాభం: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 218.68 కోట్లుగా ఉన్న లాభం, ఈసారి ఏకంగా 90.36 శాతం పెరిగి రూ. 416.29 కోట్లకు చేరింది.
  • ఆదాయం: కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 42.11 శాతం వృద్ధితో రూ. 10,343.41 కోట్లుగా నమోదైంది.
  • అంతర్జాతీయ మార్కెట్: విదేశీ వ్యాపారంలో కూడా కంపెనీ 64 శాతం లాభాన్ని, 38 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది.

కంపెనీ జోరుకు కారణాలేంటి?

పండుగ సీజన్ కావడంతో భారత్‌లో బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా దక్షిణాదియేతర మార్కెట్లలో (Non-South) కంపెనీ తన పట్టును పెంచుకోవడం కలిసొచ్చింది. అలాగే, భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం (Interim Trade Agreement) ఆభరణాల ఎగుమతులకు కొత్త జవజీవాలు పోసింది. అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కావడంతో ఈ ప్రభావం కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

అప్పుల్లేని కంపెనీగా మార్పు..

కంపెనీ యాజమాన్యం మరో కీలక విషయాన్ని వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 'నెట్ డెట్-ఫ్రీ' (అప్పుల్లేని సంస్థ)గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అనవసరపు ఆస్తుల విక్రయం, వచ్చిన లాభాలను అప్పుల చెల్లింపులకు మళ్లించడం వంటి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కంపెనీలో ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ 50 శాతం ఆదాయ వాటాను అందిస్తూ విజయవంతంగా సాగుతోంది.

ఇప్పుడు ఈ షేర్ కొనవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు కళ్యాణ్ జ్యువెలర్స్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి.

  • జేఎమ్ ఫైనాన్షియల్ (JM Financial): ఈ షేరుకు 'BUY' రేటింగ్ ఇస్తూ, టార్గెట్ ప్రైస్‌ను రూ. 750గా నిర్ణయించింది. కంపెనీ ఆదాయ వృద్ధి నిలకడగా ఉందని పేర్కొంది.
  • మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal): వీరు కూడా 'BUY' రేటింగ్ ఇస్తూ, రూ. 600 లక్ష్యంగా పెట్టుకోవచ్చని సూచించారు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడటం, అప్పులు తగ్గించుకోవడాన్ని వీరు ప్రధాన సానుకూల అంశాలుగా పేర్కొన్నారు.
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More