Crime news : షాకింగ్! ఆసుపత్రిలో భర్త- సెలైన్ బాటిల్‌లో విషం కలిపించి చంపించిన భార్య, ప్రియుడితో కలిసి..

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోరం జరిగింది. బైక్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన మాజీ సైనికుడిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి సెలైన్ బాటిల్‌లో విషం ఇచ్చి దారుణంగా హత్య చేశారు! రూ. 2 కోట్ల బీమా డబ్బు కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు చెప్పిన విషయాలు అందరిని షాక్​కి గురిచేస్తున్నాయి

Published on: Jun 16, 2026, 13:00:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోడ్డుపై వెళుతుంటే చిన్న బైక్ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చేరిన రెండు రోజులకు అతను గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు ప్రకటించారు! అంతా ఇది సహజ మరణమే అనుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే అది గుండెపోటు కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అత్యంత దారుణమైన హత్య అని తేలింది. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేయడం కోసం ఒక మహిళ.. ఆమె ప్రియుడితో కలిసి ఆసుపత్రి సిబ్బందిని, ల్యాబ్ అధికారులను చేరదీసి మరీ తన భర్తను కాటికీ పంపించింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఉదంతాన్ని పోలీసులు బయటపెట్టారు.

ఆసుపత్రిలో భర్తను చంపించిన భార్య! ప్రియుడితో కలిసి..
ఆసుపత్రిలో భర్తను చంపించిన భార్య! ప్రియుడితో కలిసి..

ఈ నేపథ్యంలోనే మాజీ సైనికుడైన సందీప్ మంజరగి హత్య కేసులో అతని భార్య, ఆమె ప్రియుడితో సహా ఆధారాలను తారుమారు చేయడానికి సహకరించిన మరో ఏడుగురిని (మొత్తం తొమ్మిది మందిని) పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మాజీ సైనికుడు సందీప్ మంజరగి మార్చి 13న జరిగిన ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో బైక్ స్కిడ్ అవ్వడంతో గాయపడ్డాడు. మొదట అతడిని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం అతని భార్య సుమా మంజరగి, ఘటప్రభలోని జేజీ ఆసుపత్రికి మార్చింది. అయితే, మార్చి 15న సందీప్ ఆసుపత్రిలోనే మరణించాడు. అతనికి గుండెపోటు రావడం వల్లే చనిపోయాడని రికార్డుల్లో నమోదు చేశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని బిమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ వచ్చిన ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలో కూడా శరీరంలో ఎలాంటి విషం లేదని, కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) వల్లే మృతి చెందాడని తేలింది.

అనుమానం తెప్పించిన సోషల్ మీడియా పోస్ట్!

సాధారణంగా ముగిసిపోవాల్సిన ఈ కేసులో పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. బైక్ ప్రమాదంలో సందీప్‌కు పెద్దగా గాయాలేవీ కాలేదు, పైగా అతను శారీరకంగా చాలా దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో ఎలా చనిపోతాడనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ తరుణంలో కేసు ఊహించని మలుపు తిరిగింది. సందీప్ భార్య సుమ ప్రియుడైన పుండలీక్ దొంబార్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక స్టేటస్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ప్రమాదానికి గురైన వ్యక్తి అంత హఠాత్తుగా ఎలా చనిపోతాడంటూ, ఈ కేసు వెనుక ఏదో అంతర్గత రహస్యం తనకు తెలిసినట్లుగా అతను ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దానితో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే పుండలీక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ హత్యకు సంబంధించిన అసలు గుట్టు విప్పాడని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్.. లవ్ అఫైర్!

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుండలీక్ దొంబార్, మృతుడు సందీప్ ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి భాగస్వామ్యంతో ఒక హోటల్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే సందీప్ భార్య సుమతో పుండలీక్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

మరోవైపు సందీప్ పేరు మీద మూడు వేర్వేరు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా దాదాపు రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని దక్కించుకోవడంతో పాటు తమ బంధానికి అడ్డు లేకుండా చూసుకోవడానికే వారిద్దరూ కలిసి సందీప్‌ను వదిలించుకోవాలని పథకం వేశారు. సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అక్కడి కొందరు ఉద్యోగులను డబ్బు ఆశ చూపి తమ వైపు తిప్పుకున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యే, ప్రియుడితో కలిసి సందీప్‌కు ఎక్కించే సెలైన్ బాటిల్‌లో విషం కలిపింది. అలాగే నిద్రమాత్రలు కూడా ఇచ్చి ప్రాణాలు తీశారని పోలీసులు తెలిపారు.

ల్యాబ్ సిబ్బందికి రూ. 3 లక్షల లంచం.. రికార్డుల తారుమారు!

భర్తను చంపేసిన తర్వాత ఈ నేరం ఎక్కడ బయటపడుతుందోనని నిందితులు భారీగా స్కెచ్ వేశారు. ఇదొక సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఆసుపత్రి సిబ్బంది, లాబొరేటరీ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులతో కూడిన పెద్ద నెట్‌వర్క్‌ను రంగంలోకి దించారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో విషం ఉన్నట్లు తేలకుండా మేనేజ్ చేయడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బందికి ఏకంగా రూ. 3 లక్షలకు పైగా లంచం ఇచ్చినట్లు విచారణలో తేలింది.

చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చడం, విషాన్ని సేకరించడం, ఆపై ఆధారాలను మాయం చేయడం వెనుక చాలా పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి విషం సీసాలు, సిరంజీలు, మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో భార్య సుమా మంజరగి, ప్రియుడు పుండలీక్ దొంబార్‌లతో పాటు ఆర్‌ఎమ్‌పీ డాక్టర్ బసవరాజ్ భాస్మే, ఎఫ్‌డీఏ అధికారి అశోక్ గుజనాల్, ఎఫ్‌ఎస్‌ఎల్ క్లర్క్ అప్పాసాహెబ్ నాయక్, ల్యాబ్ అసిస్టెంట్ చన్నయ్య ఆదివిస్వామిమఠ్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పీఎన్ నాగరాజ్, పుండలీక్ అనుచరులు సచిన్ సేలార్, రాహుల్ జోగిలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More