...
...
Next Story

Kerala Wayanad Landslide 2026 : వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న పలువురు

కేరళలోని వయనాడ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు చిక్కుకున్నారు. ఇప్పటికే చాలామంది సురక్షితంగా బయటపడ్డారు.

Published on: Jul 7, 2026, 18:08:58 IST
Advertisement

కేరళలోని వయనాడ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విపత్తు మరోసారి వణికించింది. మంగళవారం కురిసిన కుండపోత వానల ధాటికి వయనాడ్ పరిధిలోని మేప్పాడి సమీపంలో గల కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ‘అనాక్కంపోయిల్ - కల్లాడి - మేప్పాడి’ ట్విన్ టన్నెల్ (సొరంగ మార్గం) ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా 30 మందికిపైగా మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సహాయక చర్యల కొనసాగుతున్నాయి.

వయనాడ్‌లో మళ్లీ విరిగిన కొండచరియలు
వయనాడ్‌లో మళ్లీ విరిగిన కొండచరియలు

కోజికోడ్ - వయానాడ్ జిల్లాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక సొరంగ మార్గ పనులు కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి వయానాడ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా పేరుకుపోయిన మట్టి, కొండరాళ్లు ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చాయి. అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న కార్మికులు, ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఈ మట్టి ప్రవాహంలో చిక్కుకుపోయారు. కొద్దిరోజుల క్రితమే పనులకు స్టాప్ మెమో జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు సైట్‌లో లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కల్పెట్టాకు చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికుల సహాయంతో ఇప్పటివరకు చాలా మంది మంది ప్రాణాలతో రక్షించి మేప్పాడిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులేనని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే బురద, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జేసీబీ వంటి భారీ యంత్రాలను తరలించడం రెస్క్యూ టీమ్స్‌కు సవాల్‌గా మారింది. మట్టి కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మలప్పురం-వయానాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

వయానాడ్, కోజికోడ్ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.

కాగా వయానాడ్‌లో 2024 జులైలో సంభవించిన కొండచరియల విపత్తులో 298 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే మళ్లీ కొండచరియలు విరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe