Lalitha jewellery IPO : 2వ రోజుకు చేరిన లలితా జ్యువెలరీ ఐపీఓ సబ్స్క్రిప్షన్- అప్లై చేయాలా? వద్దా?
Lalitha jewellery IPO GMP : భారత స్టాక్ మార్కెట్లో లలితా జ్యువెలరీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ కొనసాగుతోంది. రూ. 190-201 ప్రైస్ బ్యాండ్తో వచ్చిన ఈ ఇష్యూకి గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం లభిస్తోంది. మరి ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
భారత ప్రాథమిక మార్కెట్లో మరో ప్రముఖ సంస్థ పబ్లిక్ ఇష్యూతో ముందుకొచ్చింది. లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభం కాగా.. ఆగస్టు 19 వరకు బిడ్డింగ్కు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఐపీఓ కోసం ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 190 నుంచి రూ. 201గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ కానుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మొదటి రోజు ముగిసే సమయానికే ఈ ఇష్యూ 69 శాతం సబ్స్క్రైబ్ అయింది. మరి ఈ లలితా జ్యువెలరీ ఐపీఓ జీఎంపీ ఎంత? ఈ ఐపీఓకి అప్లై చేసుకోవాలా? వద్దా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..

లలితా జ్యువెలరీ ఐపీఓ జీఎంపీ..
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. గ్రే మార్కెట్లో లలితా జ్యువెలరీ షేరు రూ. 30 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే లలితా జ్యువెలరీ ఐపీఓ జీఎంపీ రూ. 30గా ఉంది. ఇది అప్పర్ ప్రైస్ బ్యాండ్ కంటే దాదాపు 15 శాతం అధికం. దీన్ని బట్టి ఇన్వెస్టర్లకు తొలి రోజే సుమారు 15 శాతం లాభాలు దక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే కేవలం జీఎంపీని చూసి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది నిత్యం మారుతూ ఉంటుందని గుర్తుచేస్తున్నారు.
లలితా జ్యువెలరీ ఐపీఓ సబ్స్క్రైబ్ వివరాలు..
సబ్స్క్రిప్షన్ రెండో రోజు, అంటే ఆగస్టు 18 ఉదయం 10:33 గంటల సమయానికి ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం 0.97 రెట్లు బుక్ అయింది. ఇందులో రిటైల్ విభాగం 1.09 రెట్లు, ఎన్ఐఐ సెగ్మెంట్ 1.08 రెట్లు నిండగా, క్యూఐబీ పోర్షన్ 0.67 రెట్లు సబ్స్క్రైబ్ అయింది.
లలితా జ్యువెలరీ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?
ఈ ఐపీఓకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ‘అప్లై’ చేయాలని సూచించాయి.
“అప్పర్ ప్రైజ్ బ్యాండ్ వద్ద ఈ ఇష్యూ వ్యాల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉంది. బలమైన బ్రాండ్ విలువ, విస్తరణ అవకాశాలు, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం కారణంగా లలితా జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది,” అని కేసీ సెక్యూరిటీస్ పేర్కొంది.
“కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ వంటి జాతీయ బ్రాండ్లతో పోలిస్తే ఇది తక్కువ పీఈ నిష్పత్తితో అందుబాటులో ఉంది. దీని రిటర్న్ రేషియోలు (ఆర్ఓఈ > 41%) అద్భుతంగా ఉన్నాయి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది సరిపోతుంది,” అని స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ విశ్లేషిస్తూ.
యాక్సిస్ క్యాపిటల్, ఎస్ఎంఐఎఫ్ సెక్యూరిటీస్ కూడా ఈ ఐపీఓకు ‘సబ్స్క్రైబ్’ రేటింగ్ ఇచ్చాయి.
లలితా జ్యువెలరీ ఐపీఓ- ముఖ్యమైన తేదీలు..
టీ+3 లిస్టింగ్ నిబంధనల ప్రకారం.. లలితా జ్యువెలరీ ఐపీఓ అలాట్మెంట్ తేదీ ఆగస్టు 20, 2026గా ఉండవచ్చని అంచనా. అలాగే ఆగస్టు 24, 2026న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ పబ్లిక్ ఇష్యూకి ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తోంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


