Disaster alerting service : మీ ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వచ్చిందా? కంగారు పడకండి- ఇదే కారణం..

Disaster information service : విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అత్యాధునిక 'సెల్ బ్రాడ్‌కాస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్'ను మే 2, 2026న అధికారికంగా ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ వినియోగదారులకు టెస్ట్ అలర్ట్స్ పంపారు.

Published on: May 2, 2026, 12:19:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా చాలా మంది ఫోన్లు శనివారం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వైబ్రేట్​ అయ్యాయి. స్క్రీన్​ మీద “extremely severe alert” అన్న మెసేజ్​ చూసి షాక్​ అయ్యారు. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన 'డిజాస్టర్ ఇన్ఫర్మేషన్/ అలర్ట్ సిస్టమ్' పరీక్ష.

మొబైల్ వినియోగదారులకు టెస్ట్ అలర్ట్స్.. (HT)
మొబైల్ వినియోగదారులకు టెస్ట్ అలర్ట్స్.. (HT)

మే 2, 2026న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ స్వదేశీ అత్యవసర హెచ్చరిక వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. 'సాచెట్' (SACHET) అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ హెచ్చరికలు జారీ అవుతాయి. దీనిని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సంస్థ దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసింది.

ఏంటీ ఈ ‘సాచెట్’ వ్యవస్థ?

సాచెట్ అంటే తెలుగులో 'అప్రమత్తం' అని అర్థం. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏఫీ). ప్రస్తుతం ఇది భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ వ్యవస్థ ద్వారా 19 భాషల్లో సుమారు 134 బిలియన్ల ఎస్​ఎంఎస్​లు హెచ్చరికలను విపత్తు నిర్వహణ సంస్థలు పంపించాయి.

సాధారణ ఎస్​ఎంఎస్​కు.. సెల్ బ్రాడ్‌కాస్ట్‌కు తేడా ఏంటి?

ఇప్పటివరకు మనం చూసిన మెసేజ్ అలర్ట్స్ కంటే ఇది చాలా భిన్నమైనది, శక్తివంతమైనది!

సైలెంట్ మోడ్‌లో ఉన్నా వినిపిస్తుంది: మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా లేదా 'డూ నాట్ డిస్టర్బ్' (డీఎన్​డీ) లో ఉన్నా సరే, ఈ అలర్ట్ వచ్చినప్పుడు ఫోన్ పెద్ద శబ్దం, వైబ్రేషన్​తో అలారం మోగిస్తుంది.

స్క్రీన్ పై ప్రత్యక్షం: ఈ సందేశం మీ స్క్రీన్‌ను పూర్తిగా ఆక్రమిస్తుంది. మీరు దానిని చదివి 'OK' నొక్కే వరకు ఆ మెసేజ్ పోదు.

నెట్‌వర్క్ సమస్య ఉన్నా పనిచేస్తుంది: సాధారణ ఎస్​ఎంఎస్​లు కొన్నిసార్లు నెట్‌వర్క్ రద్దీ వల్ల ఆలస్యం కావచ్చు, కానీ సెల్ బ్రాడ్‌కాస్ట్ సెకన్ల వ్యవధిలో నిర్దేశిత ప్రాంతంలోని అన్ని ఫోన్లకు చేరుతుంది.

ఏయే సమయాల్లో ఈ హెచ్చరికలు వస్తాయి?

భవిష్యత్తులో ఈ వ్యవస్థను ప్రధానంగా ఈ కింది పరిస్థితుల్లో వాడతారు:

ప్రకృతి వైపరీత్యాలు: భూకంపాలు, సునామీలు, తుపానులు, పిడుగులు పడే సమయంలో.

మానవ తప్పిదాలు: గ్యాస్ లీకేజీలు, కెమికల్ హజార్డ్స్ లేదా ఇతర అత్యవసర సమయాల్లో.

యుద్ధ కాలం: దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.

ప్రస్తుతం పంపిన మెసేజ్‌లు కేవలం సిస్టమ్ పనితీరును పరీక్షించడానికి మాత్రమేనని, దీనివల్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా నిలవనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. నా ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వచ్చింది, నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలా?

లేదు. ప్రస్తుతం పంపినవి కేవలం 'టెస్ట్ మెసేజ్‌లు' మాత్రమే. అందులో క్లియర్ గా "No action is required" అని పేర్కొన్నారు. ఇది సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడటానికి చేసిన ప్రయోగం.

2. ఈ సిస్టమ్‌ను ఎవరు రూపొందించారు?

దీనిని టెలికమ్యూనికేషన్స్ విభాగం కింద పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ సి-డాట్ అభివృద్ధి చేసింది.

3. నా ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా అలారం ఎందుకు మోగింది?

అత్యవసర సమయాల్లో వినియోగదారుడు నిద్రపోతున్నా లేదా ఫోన్ చూసుకోకపోయినా అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. అందుకే ఇది ఫోన్ సెట్టింగ్స్‌ను ఓవర్‌రైడ్ చేసి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.

4. ఈ హెచ్చరికలు ఏయే భాషల్లో వస్తాయి?

ప్రస్తుతానికి తెలుగుతో పాటు 19 ప్రధాన భారతీయ భాషల్లో ఈ అలర్ట్స్ పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More