అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ ఎఫెక్ట్ ...! హైదరాబాద్లోని US కాన్సులేట్ వద్ద భద్రత కట్టుదిట్టం
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు…. నానక్రామ్గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

భద్రత కట్టుదిట్టం….!
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి….. బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ముందు జాగ్రత్త చర్యగా నానక్ రామ్ గూడలోని అమెరికా కాన్సులేట్ వెలుపల అదనపు సిబ్బందిని మోహరించడంతో భద్రత పెంచామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అదనపు బలగాలను మోహరించడం ద్వారా భద్రతను పెంచామని వివరించారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిని ఖండిస్తూ ఆదివారం హైదరాబాద్ లో పలువురు నిరసన ప్రదర్శించారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాతబస్తీ పురానీ హవేలీ చౌరస్తా వద్ద షియా ముస్లింలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమేనీ చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకొని నివాళులు అర్పించారు. పురానీ హవేలీ చౌరస్తా నుంచి దారుషిఫా వరకు నిరసన ర్యాలీ సాగింది. ఇందులో భారీఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి నిరసనల నేపథ్యంలో…. పోలీసులు ముందస్తుగానే అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో శనివారం టెహ్రాన్ లో జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ఈ విషయాన్ని ధృవీకరించింది, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ద్వారా…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని భారతీయ పౌరులకు వీసాతో పాటు కాన్సులేట్ సేవలు అందుతాయి.

E-Paper












