‘డింపీ.. ప్లీజ్ క్షమించు'.. కాలేజీ గేటుపై 'ప్రేమికుడి' వింత పోస్టర్లు!
ఝార్ఖండ్లోని ధన్బాద్లో ఒక వింత ఘటన వెలుగుచూసింది. తన ప్రేయసిని బ్రతిమాలుకుంటూ ఒక యువకుడు ఏకంగా మహిళా కాలేజీ గోడలనే పోస్టర్లతో నింపేశాడు. సెక్యూరిటీని బెదిరించి మరీ అతను చేసిన పని ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం లేదా అదే ప్రేయసికి రకరకాలుగా క్షమాపణలు కోరడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాము. కానీ, ఝార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలో ఒక యువకుడు ఏకంగా 90ల నాటి బాలీవుడ్ సినిమాలను తలపించేలా ఓవరాక్షన్ చేశాడు! తన ప్రేయసి మనసు గెలుచుకోవడానికి ఏకంగా ఒక మహిళా కాలేజీ మెయిన్ గేటును వేదికగా చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఉదయం స్థానిక బీఎస్ఎస్ మహిళా కళాశాల వద్ద కలకలం సృష్టించింది.

కాలేజీ గేటుపై 'డింపీ' పోస్టర్లు..
ధన్బాద్లోని ప్రముఖ బీఎస్ఎస్ మహిళా కాలేజీ మెయిన్ గేటు వద్దకు ఉదయం వచ్చిన విద్యార్థినులు, అటుగా వెళుతున్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తెల్లటి కాగితాలపై పెద్ద అక్షరాలతో రాసిన డజన్ల కొద్దీ పోస్టర్లు అక్కడ దర్శనమిచ్చాయి. అందులో "డింపీ" అనే యువతిని ఉద్దేశించి ఒక యువకుడు దీర్ఘ క్షమాపణలు కోరుతూ సందేశాన్ని రాశాడు.
"ఐ యామ్ సారీ డింపీ.. నన్ను క్షమించు. నా వల్ల తప్పయిపోయింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. నా జీవితంలో నువ్వు చాలా ముఖ్యం," అంటూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆ పోస్టర్లు ఉన్నాయి.
అడ్డుకున్న సిబ్బందిపై చిందులు..
కాలేజీ సెక్యూరిటీ గార్డు, ప్యూన్ ఆ పోస్టర్లను తొలగించడానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న సదరు యువకుడు వారిని అడ్డుకున్నాడు. "వీటిని ముట్టుకుంటే బాగుండదు" అని సిబ్బందిని బెదిరిస్తూ నానా హంగామా చేశాడు. ఈ లోపు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కరుణా సింగ్ అక్కడికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్ రాకను గమనించిన ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం సిబ్బంది ఆ పోస్టర్లన్నింటినీ చించి పడేశారు.
భద్రతపై ఆందోళన.. పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం సీరియస్ అయింది. మహిళా కళాశాల వద్ద ఇలాంటి పనులు చేయడం విద్యార్థినుల భద్రతకు ముప్పు కలిగించడమేనని ప్రిన్సిపాల్ కరుణా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈరోజు పోస్టర్లు అంటించిన వ్యక్తి రేపు కాలేజీ లోపలికి రావడానికి కూడా వెనుకాడకపోవచ్చు. విద్యార్థినుల రక్షణే మాకు ముఖ్యం. ఇలాంటి ఆకతాయి వేషాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి," అని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ధన్బాద్ డిప్యూటీ కమిషనర్ (డీసీ), స్థానిక పోలీసులకు కాలేజీ తరపున ఫిర్యాదు అందింది. కాలేజీ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ యువకుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
బహిరంగ ప్రదేశాల్లో ఇలా వికృత చేష్టలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ధన్బాద్ మహిళా కాలేజీలో అసలు ఏం జరిగింది?
ఒక యువకుడు తన ప్రేయసి 'డింపీ'కి క్షమాపణ చెబుతూ పదుల సంఖ్యలో పోస్టర్లను బీఎస్ఎస్ మహిళా కళాశాల మెయిన్ గేటుకు అంటించాడు. దానిని అడ్డుకున్న కాలేజీ సిబ్బందిని సైతం అతను బెదిరించాడు.
2. పోస్టర్లలో యువకుడు ఏం రాశాడు?
"నన్ను క్షమించు డింపీ, నా వల్ల పొరపాటు జరిగింది. నువ్వు నాకు చాలా ముఖ్యం. మళ్లీ ఇలాంటి తప్పు చేయను" అని ఆ పోస్టర్లలో రాసి ఉంది.
3. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
4. కళాశాల యాజమాన్యం ఏమంటోంది?
విద్యార్థినుల భద్రత దృష్ట్యా ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం కోరుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


