లేడీస్ గెటప్‌లో ఆర్టీసీ బస్టాండ్‌కు : బుర్ఖా చాటున యువకుడు.. పట్టుకున్న ప్రయాణికులు!

జగిత్యాల జిల్లాలో వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడు బుర్ఖా వేసుకుని ఆర్టీసీ బస్టాండ్ వచ్చాడు. అయితే ప్రయాణికులకు అతడి ప్రవర్తన అనుమానం వచ్చింది.

Published on: Feb 18, 2026 5:40 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 15 ఆదివారం నాడు తెలంగాణలోని జగిత్యాలలోని కోరుట్ల బస్ స్టేషన్‌లో బుర్ఖా, స్కార్ఫ్ ధరించిన మహిళగా పోజులిచ్చిన ఘటనలో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోరుట్ల సబ్-ఇన్స్పెక్టర్ చిరంజీవి ఈ సంఘటనను ధృవీకరించారు. యువకులు ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియోలు చేయడానికి బుర్ఖా ధరించారని చెప్పారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కోరుట్ల బస్ స్టేషన్‌లో జరిగిందని వెల్లడించారు.

బుర్ఖాలో యువకుడు
బుర్ఖాలో యువకుడు

బుర్ఖా ధరించిన యువకుడు మహ్మద్ నుమాన్. అతను తన స్నేహితుడు మహ్మద్ అకీల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేయడానికి వచ్చాడు. 21 ఏళ్ల నుమాన్ బస్ స్టేషన్‌లోని మహిళల మధ్యలో కూర్చుని ఉండటంతో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని పట్టుకున్నారు. పురుషుడని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నుమాన్ గతంలో కూడా అకీల్‌తో కలిసి సోషల్ మీడియా కోసం ఇలాంటి నాలుగైదు వీడియోలు చేసాడని పోలీసులు తెలిపారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో నుమాన్ తండ్రికి ఒక హోటల్ ఉంది. ఇద్దరు యువకులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 292, భారత శిక్షాస్మృతిలోని 290 కింద నాన్-కాగ్నిజబుల్, బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేశారు. ఇందులో జరిమానా కూడా ఉంటుంది.

నిజానికి మెుదట్లో నుమాన్‌ను ఎవరూ గుర్తించలేదు. కాసేపటి తర్వాత అతడి నడక, ప్రవర్తనలో తేడా గమనించారు. మహిళల మధ్య కూర్చుని చేస్తున్న వింత పనులతో అనుమానం వచ్చింది. పురుషుడని గుర్తించిన తర్వాత ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని అడిగారు. ఆ యువకుడు మాత్రం మెుదట్లో సరైన సమాధానం ఇవ్వలేదు. నవ్వుతూ సమాధానాన్ని దాటేశాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది.

తన ఫ్రెండ్ బుర్ఖాలో రమ్మన్నాడని మెుదట్లో నుమాన్ చెప్పుకొచ్చాడు. గట్టిగా అడిగేసరికి అసలు విషయం బయటకు వచ్చింది. రీల్స్ పిచ్చితోనే ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా చెప్పాడు. నుమాన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.