...
...
Next Story

ఇన్వెస్టర్ల పంట పండించిన మీషో: 110 శాతం లాభాలతో 'మల్టీబ్యాగర్‌'గా అవతారం.. ఇప్పుడు కొనవచ్చా?

మీషో షేర్లు స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఐపీఓ ధర రూ. 111 తో పోలిస్తే ఏకంగా 110% పైగా లాభపడి రూ. 233.50 వద్ద రికార్డు స్థాయిని తాకాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ మీకోసం.

Published on: Dec 18, 2025 10:20 AM IST
Advertisement

స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ-కామర్స్ దిగ్గజం మీషో (Meesho) ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ స్టాక్ ఏకంగా ‘మల్టీబ్యాగర్‌’గా మారిపోయింది. గురువారం (డిసెంబర్ 18) నాటి ట్రేడింగ్‌లో మీషో షేర్ ధర రూ. 233.50 వద్ద రికార్డు స్థాయిని తాకింది. తన ఐపీఓ ధర రూ. 111 తో పోలిస్తే ఇది 110 శాతం అదనం. అంటే చూస్తుండగానే ఇన్వెస్టర్ల పెట్టుబడి రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది.

మార్కెట్లో మీషో జైత్రయాత్ర

ఇన్వెస్టర్ల పంట పండించిన మీషో: 110 శాతం లాభాలతో 'మల్టీబ్యాగర్‌'గా అవతారం (Bloomberg)
ఇన్వెస్టర్ల పంట పండించిన మీషో: 110 శాతం లాభాలతో 'మల్టీబ్యాగర్‌'గా అవతారం (Bloomberg)

వరుసగా నాలుగో రోజు కూడా మీషో షేర్లు లాభాల్లో పయనించాయి. గత నాలుగు రోజుల్లోనే ఈ స్టాక్ సుమారు 41 శాతం పెరగడం గమనార్హం. బిఎస్ఈ (BSE)లో నేడు 8 శాతం లాభంతో రూ. 233.50 వద్ద ట్రేడ్ అయ్యింది. గత మూడు సెషన్లలో వరుసగా 20%, 5.6%, 3.4% చొప్పున పరుగులు పెట్టింది.

ఐపీఓ సమయంలో రూ. 111 గా ఉన్న ధర, లిస్టింగ్ రోజే రూ. 162 కి చేరి బంపర్ ఓపెనింగ్ ఇచ్చింది. ఇప్పుడు అది ఏకంగా రూ. 230 దాటి దూసుకుపోతోంది.

నిపుణులు ఏమంటున్నారు?

ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS, మీషో స్టాక్‌కు 'బై' (Buy) రేటింగ్ ఇచ్చింది. "మీషో అనుసరిస్తున్న అసెట్-లైట్ బిజినెస్ మోడల్, పెరుగుతున్న యూజర్ బేస్ ఆ సంస్థకు లాభదాయకం. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థ లావాదేవీల విలువ (NMV) ఏడాదికి 30 శాతం చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉంది" అని UBS తన నివేదికలో పేర్కొంది. వీరు ఈ స్టాక్‌కు రూ. 220 టార్గెట్ ప్రైస్ నిర్ణయించగా, స్టాక్ ఇప్పటికే ఆ స్థాయిని దాటేసింది.

ఇప్పుడు కొనవచ్చా? నిపుణుల హెచ్చరిక

"ఐపీఓ ధరతో పోలిస్తే ఇప్పటికే ధర రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సానుకూలత అంతా ధరలో కలిసిపోయింది. అందుకే ఈ స్థాయిలో కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి" అని ఐఎన్‌వీ అసెట్ (INVAsset) బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ విశ్లేషించారు. మీషో 2వ, 3వ శ్రేణి నగరాల్లో బలమైన పట్టు కలిగి ఉన్నప్పటికీ, స్థిరమైన లాభాలను చూపించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, ఛాయిస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ ఉత్సవ్ వర్మ మాట్లాడుతూ.. "సాధారణ పరిస్థితుల్లో ఈ స్టాక్ రూ. 200 వద్ద ఉండవచ్చు, కానీ కంపెనీ అంచనాలకు మించి రాణిస్తే రూ. 234 వరకు వెళ్లే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం స్టాక్ తన గరిష్ట స్థాయి (Bull-case) వద్దే ట్రేడ్ అవుతోందని అర్థం.

మీషో సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

UBS అంచనాల ప్రకారం.. మీషో యాక్టివ్ యూజర్లు 19.9 కోట్ల నుంచి 2030 నాటికి 51.8 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కంపెనీ తన లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకుంటూ, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడం ద్వారా మార్కెట్లో తన వాటాను పెంచుకుంటోంది. అయితే, పోటీ ఎక్కువగా ఉన్న ఈ రంగంలో కంపెనీ ప్రతి త్రైమాసికంలోనూ మెరుగైన ఫలితాలను చూపించాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe