...
...
Next Story

ట్రంప్, నెతన్యాహు, మెలోని.. ఇరాన్ 'రివెంజ్ లిస్ట్' లోని 13 మంది ప్రపంచ నేతలు వీరే

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతికారం తీర్చుకుంటామని కొత్త సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ శపథం చేసిన నేపథ్యంలో, ఇరాన్‌కు చెందిన ఒక పత్రిక 13 మంది విదేశీ నేతల ఫోటోలతో కూడిన ఒక వివాదాస్పద ఇన్ఫోగ్రాఫిక్‌ను ప్రచురించింది. ఈ ‘రివెంజ్ లిస్ట్’లో పలు దేశాల అధినేతలు ఉన్నారు.

Published on: Jul 13, 2026, 16:50:14 IST
Advertisement

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి వెలువడే ప్రభుత్వ పత్రిక 'హమ్‌షాహ్రీ' (Hamshahri) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి కారణమైన 13 మంది విదేశీ రాజకీయ, సైనిక నాయకులను లక్ష్యంగా చేసుకోవాలంటూ వారి ఫోటోలతో కూడిన ఇన్ఫోగ్రాఫిక్‌ను ఈ పత్రిక విడుదల చేసింది.

ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు (AFP)
ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు (AFP)

అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా స్పందించిన కొద్దిసేపటికే ఈ జాబితా వెలుగులోకి వచ్చింది.

"ప్రతికారం అనేది మా జాతీయ సంకల్పం, దీనిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. మా లిస్టులో ఉన్న ఈ నేరస్థులు, తమ పడకలపై ప్రశాంతంగా మరణించాలనే కోరికను తమతో పాటే సమాధి చేసుకుంటారు" అని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.

అయితే మొజ్తబా ఖమేనీ నిర్దిష్టంగా ఎవరి పేర్లనూ బహిరంగంగా ప్రస్తావించలేదు. అలాగే ఈ పత్రిక ప్రచురించిన జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

ఇరాన్ 'రివెంజ్ లిస్ట్' లోని 13 మంది నేతలు:

హమ్‌షాహ్రీ పత్రిక ప్రచురించిన ఇన్‌ఫోగ్రాఫిక్ ప్రకారం లక్ష్యంగా చేసుకోవాల్సిన నాయకులు వీరే:

  • డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు
  • బెంజమిన్ నెతన్యాహు – ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి
  • జార్జియా మెలోని – ఇటలీ ప్రధాన మంత్రి
  • కీర్ స్టార్మర్ – బ్రిటన్ ప్రధాన మంత్రి
  • ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ – ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • ఫ్రీడ్రిచ్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్
  • ఇజ్రాయెల్ కాట్జ్ – ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
  • గిడియాన్ సార్ – ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి
  • ఇయాల్ జమీర్ – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చీఫ్
  • మార్కో రూబియో – అమెరికా విదేశాంగ మంత్రి (Secretary of State)
  • పీట్ హెగ్‌సెత్ – అమెరికా రక్షణ మంత్రి (Secretary of Defense)
  • జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా / బ్రాడ్ కూపర్ – యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్లు
  • మైక్ హక్కబీ – ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి

ఈ జాబితాలో యూరప్ నేతలు ఎందుకు ఉన్నారు?

హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దళాల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడంతో, అమెరికా ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్లు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, ఒమన్) క్షిపణులతో విరుచుకుపడింది.

ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక అవగాహన పూర్తిగా దెబ్బతిన్నదని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, ఖతార్, ఈజిప్ట్ దేశాలు శాంతి చర్చల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe