ఇండియాలో మెస్సీ- కోల్​కతాలో ఫుట్​బాల్​ లెజెండ్​కి ఘన స్వాగతం..

ఫుట్​బాల్​ లెజెండ్​ లియోనల్​ మెస్సీ ఇండియాలో అడుగుపెట్టారు! కోల్​కతా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత మధ్య ఆయన హోటల్​కు వెళ్లారు. సోమవారం వరకు ఇండియాలోనే ఉండనున్న మెస్సీ కోల్​కతాతో పాటు హైదరాబాద్​, ముంబై, దిల్లీలో పర్యటించనున్నారు.

Published on: Dec 13, 2025, 05:36:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

కోల్​కతాలో విమానాశ్రయంలో మెస్సీ..
కోల్​కతాలో విమానాశ్రయంలో మెస్సీ..

మెస్సీ తన మూడు రోజుల 'GOAT ఇండియా టూర్ 2025' పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. కోల్‌కతా నుంచి మొదలుపెట్టి నాలుగు నగరాల్లో ఈ టూర్ కొనసాగనుంది. విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్ సభ్యులు సైతం ఆయన రాకను తమ కెమెరాల్లో బంధిస్తూ కనిపించారు. విమానం దిగగానే మెస్సీకి అధికారులు పెద్ద ఎత్తున్న భద్రతను కల్పించారు.

కోల్‌కతాలో అభిమానుల కోలాహలం..

మెస్సీ రాకకు ముందుగానే, కోల్‌కతా విమానాశ్రయం వెలుపల అభిమానులు భారీగా గుమిగూడి ఆయన పేరును బిగ్గరగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. వారిలో కొందరు అర్జెంటీనా ప్రపంచకప్ జెర్సీలు ధరించి కనిపించారు. మెస్సీ బస చేయబోయే హోటల్ చుట్టూ కూడా అభిమానులు కిక్కిరిసిపోయారు.

ఆటగాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వాగతం పలికేందుకు, విమానాశ్రయం, హోటల్ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతను భారీగా పెంచారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసులను మోహరించినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

మెస్సీ ఇండియా పర్యటన వివరాలు..

మెస్సీ భారత్‌కు రావడం ఇది రెండోసారి! చివరిసారిగా ఆయన 2011లో వెనిజులాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం కోల్‌కతాకు వచ్చారు.

ఈ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడి తాజా పర్యటన శనివారం కోల్‌కతాలో మొదలైంది. ఈరోజు ఆయన హైదరాబాద్‌కు పయనమవుతారు. తన పర్యటనలో రెండో రోజు ముంబైలో గడుపుతారు, ఆపై సోమవారం దిల్లీలో తన పర్యటనను ముగిస్తారు.

భారత్ నుంచి బయలుదేరే ముందు, మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలవనున్నారు.

70 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

కోల్‌కతాలో శనివారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య మెస్సీ ఒక స్పాన్సర్-ఎక్స్‌క్లూజివ్ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. ఇక్కడ అర్జెంటీనా-ఇండియన్ ఫ్యూజన్ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది.

హోటల్ గది నుంచే, తన “అతిపెద్ద విగ్రహాన్ని” (70 అడుగుల భారీ నిర్మాణం) ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు! వాస్తవానికి ఈ విగ్రహాన్ని శ్రీభూమి వద్ద స్వయంగా ఆవిష్కరిస్తారని భావించినా, అక్కడి ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

స్టేడియం ఈవెంట్‌కు భారీ డిమాండ్..

స్టేడియం ఈవెంట్‌కు 70 వేల మందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. భారీ డిమాండ్ మధ్య, నిర్వాహకులు ఈ వారం మంగళవారం నుంచి కౌంటర్ల ద్వారా టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. అందుకోసం 75,000 సీట్లను అందుబాటులో ఉంచారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More