...
...
Next Story

మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు: 4,800 మంది ఉద్యోగుల తొలగింపు, ఎక్స్‌బాక్స్ విభాగానికి గండం

మైక్రోసాఫ్ట్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఏకంగా 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా గేమింగ్ విభాగమైన 'ఎక్స్‌బాక్స్' (Xbox), దాని పరిధిలోని పలు ప్రతిష్టాత్మక గేమింగ్ స్టూడియోలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Published on: Jul 6, 2026, 19:41:52 IST
Advertisement

గ్లోబల్ గేమింగ్ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ లేఆఫ్స్ సైకిల్‌కు మైక్రోసాఫ్ట్ తెరలేపింది. సిఎన్‌బిసి (CNBC) నివేదిక ప్రకారం, జులై 6, సోమవారం నాడు మైక్రోసాఫ్ట్ సంస్థ తన మొత్తం సిబ్బందిలో 2.1% మందిని, అంటే 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం నేపథ్యంలో ఖర్చులను అదుపు చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ చర్యలకు పూనుకుంది. ఈ నిర్ణయం వల్ల ఎక్స్‌బాక్స్ (Xbox) డివిజన్ తన మొత్తం సిబ్బందిలో ఐదింట ఒక వంతు (20%) మందిని కోల్పోతోంది.

మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు: 4,800 మంది ఉద్యోగుల తొలగింపు
మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు: 4,800 మంది ఉద్యోగుల తొలగింపు

మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆమీ కోల్‌మన్ (Amy Coleman) ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో.. "సాంకేతికతను రూపొందించే, విస్తరించే, ఉపయోగించే విధానం నేను ఇక్కడ ఉన్న 27 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వేగంగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులభం కాదు" అని పేర్కొన్నారు.

ఎక్స్‌బాక్స్ (Xbox) లో 3,200 ఉద్యోగాల కోత

ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ (Asha Sharma) పంపిన అధికారిక ఈమెయిల్ ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ విభాగం నుండి మొత్తం 3,200 మందిని తొలగించనున్నారు. ఇందులో భాగంగా 1,600 మందిని సోమవారమే విధుల నుండి తప్పించారు. మిగిలిన 1600 మందిని తరువాత తప్పించనున్నారు.

"సంవత్సరం పొడవునా జరిగే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అదనపు సవాళ్లను సృష్టిస్తుందని నాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ, అవసరమైన అన్ని మార్పులను ఒకే రోజులో చేయడం సాధ్యం కాదు. అయితే 2027 లో మేం మళ్లీ బలమైన వృద్ధి పథంలోకి వస్తాం" అని ఆశా శర్మ ధీమా వ్యక్తం చేశారు.

తీవ్రంగా నష్టపోనున్న పాపులర్ గేమింగ్ స్టూడియోలు

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ భారీ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వల్ల గేమింగ్ పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన మధ్య శ్రేణి (mid-tier) స్టూడియోలు, రాబోయే క్రేజీ గేమ్స్ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

కంపల్షన్ గేమ్స్, డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్: 'సౌత్ ఆఫ్ మిడ్‌నైట్', 'వి హ్యాపీ ఫ్యూ' వంటి ప్రసిద్ధ గేమ్స్ అందించిన మోంట్రియల్ స్టూడియో, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డెవలపర్ సంస్థలు ప్రస్తుతం మూసివేత లేదా బైఅవుట్ (కొనుగోలు) చర్చల్లో ఉన్నాయి.

అన్‌డెడ్ ల్యాబ్స్: గేమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్టేట్ ఆఫ్ డికే 3' (State of Decay 3) గేమ్‌ను డెవలప్ చేస్తున్న ఈ స్టూడియో (సుమారు 110 మంది సిబ్బంది) ప్రస్తుతం కార్పొరేట్ రివ్యూలో ఉంది.

ఆర్కేన్ లియాన్: ‘డిస్‌హానర్డ్' (Dishonored), 'డెత్‌లూప్' (Deathloop) వంటి సూపర్ హిట్ గేమ్‌లను అందించిన ఈ ప్రఖ్యాత స్టూడియో కూడా మూతపడే దశలో ఉంది. దీనివల్ల, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సూపర్ హీరో యాక్షన్ గేమ్ 'మార్వెల్స్ బ్లేడ్' (Marvel's Blade) పూర్తిగా రద్దయ్యే (Cancellation) ప్రమాదం పొంచి ఉంది.

పరిశ్రమ వర్గాల ఆందోళన:

గ్లోబల్ గేమింగ్ పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో కార్పొరేట్ ఉద్యోగాలు, క్రియేటివ్ డెవలప్‌మెంట్ స్టూడియోలను ఒకేసారి కత్తిరించడం అనేది మునుపెన్నడూ లేని ఒక విచారకరమైన మైలురాయి అని ప్రముఖ గేమింగ్ ఇన్‌సైడర్ జార్జ్ బ్రౌసార్డ్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe