...
...
Next Story

ITR filing : జులై 31 డెడ్​లైన్ మిస్​ అయ్యారా? ఐటీఆర్​ ఫైలింగ్​కి ఇంకా ఛాన్స్​ ఉంది- కానీ ఈ నష్టాలు తప్పవు..

Belated ITR filing : జులై 31 ఐటీఆర్ గడువు మిస్ అయ్యారా? డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంది. లేట్ ఫీజు, వడ్డీ, కోల్పోయే పన్ను ప్రయోజనాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 5, 2026, 11:21:47 IST
Advertisement

అసెస్మెంట్ ఇయర్ 2026-27 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు నిర్దేశించిన జులై 31 గడువును మిస్ అయిన పన్ను చెల్లింపుదారులకు చట్టబద్ధంగా మరో అవకాశం అందుబాటులో ఉంది. ఆలస్యంగా దాఖలు చేసే బిలేటెడ్ రిటర్న్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. అయితే ఈ ఆలస్యానికి కొంత మేర జరిమానాతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తుంది.

ఐటీఆర్​ ఫైలింగ్ గడువు మిస్ అయ్యారా?
ఐటీఆర్​ ఫైలింగ్ గడువు మిస్ అయ్యారా?

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139(4) ప్రకారం, పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2026 వరకు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. సాధారణ ఐటీఆర్ సమర్పించినట్లే ఈ ప్రక్రియ కూడా ఉన్నప్పటికీ, ఆలస్యమైనందుకు గాను అదనంగా లేట్ ఫీజు, చెల్లించాల్సిన పన్ను బకాయిలపై వడ్డీ పడతాయి.

“నిర్దేశిత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోయిన ప్రతి పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 139(4) ప్రకారం బిలేటెడ్ రిటర్న్ వేయవచ్చు. వేతన జీవులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారవేత్తలతో పాటు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అర్హత ఉండి పూర్తి చేయని వారందరికీ ఇది వర్తిస్తుంది. పన్ను రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా బిలేటెడ్ రిటర్న్ సమర్పించవచ్చు,” అని క్లియర్‌టాక్స్ పన్ను నిపుణుడు సిఏ చాందిని ఆనందన్ తెలిపారు.

1 ఫైనాన్స్ టాక్స్ హెడ్ సిఏ పరాగ్ జైన్ మాట్లాడుతూ.. బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ విధానం కూడా సాధారణ ఐటీఆర్‌లాగే ఉంటుందని వివరించారు. పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, తగిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఫైలింగ్ సమయంలో సెక్షన్ 139(4)ను సెలెక్ట్ చేసుకుని, తమ ఆదాయ వివరాలను నమోదు చేయాలి. చెల్లించాల్సిన బకాయి పన్నుతో పాటు వర్తించే వడ్డీ, లేట్ ఫీజు చెల్లించి, 30 రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన చెప్పారు.

ఎంత ఛార్జీ పడుతుంది? ఏ ప్రయోజనాలు కోల్పోతారు?

“లేట్ ఫీజు, వడ్డీ భారం పడటంతో పాటు కొన్ని కీలకమైన పన్ను ప్రయోజనాలను కోల్పోవడమే బిలేటెడ్ రిటర్న్ వల్ల జరిగే అతిపెద్ద నష్టం. వ్యాపార లేదా మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు. అలాగే ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల రీఫండ్ ప్రక్రియ ఆలస్యమవుతుంది,” అని సిఏ చాందిని ఆనందన్ చెప్పారు.

అయితే ఐటీఆర్​ ఫైలింగ్ గడువు దాటినప్పటికీ సెక్షన్ 80సీ, 80డీ కింద పొందే మినహాయింపులు, హెచ్‌ఆర్‌ఏ, స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 54, 54ఎఫ్ కింద క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులు, టీడీఎస్ క్రెడిట్లు, రీఫండ్లను పన్ను చెల్లింపుదారులు యథావిధిగా క్లెయిమ్ చేసుకోవచ్చని పరాగ్ జైన్ స్పష్టం చేశారు.

అయినప్పటికీ నిర్ణీత గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోవడం వల్ల ఆ అసెస్మెంట్ సంవత్సరానికి పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు కోల్పోతారని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మూలధన నష్టాలు, వ్యాపార నష్టాలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. అయితే గృహ ఆస్తి నష్టాలు మాత్రం మినహాయింపుగా నిలుస్తాయి, నిబంధనలకు లోబడి వీటిని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు.

బిలేటెడ్ రిటర్న్‌లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చా?

ఒకవేళ బిలేటెడ్ రిటర్న్ సమర్పించిన తర్వాత అందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

"చట్టబద్ధమైన సమయ పరిమితిలోగా, అసెస్మెంట్ ప్రక్రియ పూర్తి కాకముందే సెక్షన్ 139(4) కింద దాఖలు చేసిన బిలేటెడ్ రిటర్న్‌ను సెక్షన్ 139(5) ప్రకారం సవరించి సరికొత్తగా సమర్పించవచ్చు," అని సిఏ చాందిని ఆనందన్ వివరించారు.

ఐటీఆర్ ఫైల్ చేసేముందు తమ ఆదాయ వివరాలను యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారమ్ 26ఏఎస్​లతో జాగ్రత్తగా సరిపోల్చుకోవాలని పరాగ్ జైన్ సూచించారు. సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకుని, బకాయిలన్నీ చెల్లించి 30 రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఇ-వెరిఫై చేయకపోతే దాఖలు చేసిన ఐటీఆర్ చెల్లకుండా పోతుంది.

అలాగే పన్ను రీఫండ్‌లో అనవసర జాప్యాన్ని నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతాను ముందే ప్రీ-వాలిడేట్ చేసుకోవాలని, డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు రాకుండా ఉండేందుకు ఆదాయ వివరాలన్నింటినీ పక్కాగా వెల్లడించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe