నీట్ పరీక్ష రద్దు దారుణం: రీ-ఎగ్జామ్ భయంతో విద్యార్థిని ఆత్మహత్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు వ్యవహారం ఒక నిరుపేద విద్యార్థిని ప్రాణాలను బలితీసుకుంది. మళ్లీ పరీక్ష రాస్తే మొదటిలా మార్కులు సాధించలేనేమోననే ఆందోళనతో 20 ఏళ్ల యువతి నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడింది.

Published on: Jun 4, 2026, 10:20:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, ఆ తర్వాతి పరిణామాల వల్ల పరీక్ష రద్దవడం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పరీక్ష రద్దవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 20 ఏళ్ల నీట్ అభ్యర్థిని 14 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని రాసిన ఆత్మహత్య లేఖ తాజాగా లభించడంతో ఈ దారుణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.

నీట్ నిర్వహణ వైఫల్యంపై ముంబైలో యువజన కాంగ్రెస్ నిరసన (Deepak Salvi)
నీట్ నిర్వహణ వైఫల్యంపై ముంబైలో యువజన కాంగ్రెస్ నిరసన (Deepak Salvi)

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఈ యువతి, తన తండ్రి నాగపూర్‌లో వంటమనిషిగా పనిచేస్తుండటంతో కుటుంబంతో సహా అక్కడే నివసిస్తూ నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె మరణానంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమె పుస్తకాలను సర్దుతుండగా ఒక నోట్‌బుక్‌లో ఆత్మహత్య లేఖ దొరికింది.

"నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్ష పెడితే, మొదటిలాగే బాగా రాస్తాననే గ్యారంటీ లేదు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నేను అంతా పాడుచేశాను" అని ఆ యువతి తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది.

వ్యవస్థ వైఫల్యంపై తండ్రి ఆవేదన

పరీక్ష రద్దు కావడం వల్లే ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, అయితే ఆత్మహత్యకు అదే కారణమని తాము ముందుగా ఊహించలేకపోయామని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, ఎలాగైనా డాక్టర్ కావాలనే బలమైన ఆశయంతో ఉన్న తన కుమార్తె కోసం అప్పులు చేసి మరీ చదివించానని ఆమె తండ్రి వాపోయారు.

"నా కుమార్తె ఎంతో తెలివైంది, ఎప్పుడూ డాక్టర్ అవ్వాలని కలలుగనేది. మా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఆమెను చదివించాం. పరీక్ష రాశాక ఎంపికవుతాననే నమ్మకంతో ఎంతో సంతోషంగా ఉంది. కానీ పేపర్ లీక్, పరీక్ష రద్దు వార్తలు వినగానే పూర్తిగా కుంగిపోయింది. ప్రభుత్వం పరీక్షను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే నా 20 ఏళ్ల కష్టం వృథా అయిపోయింది" అని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థలోని లోపాల వల్ల తన కూతురిని కోల్పోయిన ఆ తండ్రి, ఇప్పుడు తన చిన్న కుమారుడి చదువును కూడా ఆపేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న అతడిని ఇలాంటి విఫలమైన విద్యా వ్యవస్థలో చదివించి మానసిక క్షోభకు గురిచేయడం కంటే, వ్యవసాయ పనుల్లో పెట్టడమే మేలని ఆయన తీవ్ర నిరాశతో వ్యాఖ్యానించారు.

అండగా ఉంటామన్న కాంగ్రెస్ నాయకులు

ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు యశ్ ఘంఘోరియా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదువు కోసం చేసిన అప్పులను తీర్చడంలో తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థ వైఫల్యం వల్లే ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More