Vande Bharat : గోవాకు కొత్త వందే భారత్​ రైలు- తగ్గనున్న ప్రయాణ సమయం, ఇంకొన్ని రోజుల్లో ప్రకటన..!

ఇప్పుడు బెంగళూరు నుంచి గోవాకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ రెండు మార్గాల మధ్య వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ని నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం ప్రయాణం 13 గంటల్లో ముగుస్తుంది.

Published on: Feb 21, 2026, 14:01:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరువాసులకు అదిరిపోయే వార్త! బెంగళూరు నుంచి గోవా ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. ఈ మేరకు ఈ రెండు ప్రధాన గమ్యస్థానాల మధ్య కొత్త వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ నడపడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు దాదాపు 13 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.

గోవాకు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​..
గోవాకు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​..

సౌత్ వెస్ట్రన్ రైల్వే ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించిందని సమాచారం. బోర్డు నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త వందే భారత్ రైలు అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

బెంగళూరు- గోవా వందే భారత్: రూట్, టైమింగ్స్​ (అంచనా)..

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త రైలు మంగళూరు రైల్వే రీజియన్ మీదుగా, బెంగళూరులోని యశ్వంత్పూర్ నుంచి గోవాలోని మడ్​గావ్ వరకు నడుస్తుంది.

యశ్వంత్​పూర్ - మడ్​గావ్: ఉదయం 6:05 గంటలకు బయలుదేరి, రాత్రి 7:15 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది.

మడ్​గావ్​ - యశ్వంత్పూర్: తిరుగు ప్రయాణంలో మడ్​గావ్​ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6:40 గంటలకు యశ్వంత్​పూర్​ చేరుకుంటుంది.

ప్రస్తుతం బెంగళూరు నుంచి గోవాకు రైలులో వెళ్లాలంటే దాదాపు 14-15 గంటల సమయం పడుతోంది. ఈ వందే భారత్​ అందుబాటులోకి వస్తే బెంగళూరువాసులకు టైమ్​ కలిసొచ్చినట్టే!

బెంగళూరు- గోవా వందే భారత్​- ప్రయాణ వేగం, మార్గంలో మార్పులు..

సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రతిపాదన ప్రకారం.. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ పాడిల్ బైపాస్ మీదుగా ప్రయాణిస్తుంది. దీనివల్ల మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

వేగం పెంపు ప్రతిపాదనలు:

చిక్కబాణవర, హసన్ మధ్య రైలు వేగాన్ని ప్రస్తుతమున్న 110 కి.మీ నుంచి 130 కి.మీకి పెంచాలని ప్రతిపాదించారు.

సకలేష్‌పూర్ - సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్‌లో వేగాన్ని 30 కి.మీ నుంచి 40 కి.మీకి పెంచాలని సూచించారు.

రైల్వే బోర్డు ఆమోదం కోసం నిరీక్షణ..

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వందే భారత్ సర్వీసు గురించి ప్రస్తావించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దాదాపు 20 రోజుల క్రితమే అధికారిక ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపినట్లు ఎస్‌డబ్ల్యూఆర్ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై రైల్వే బోర్డు చర్చలు జరుపుతోంది. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది ప్రకటన వెలువడుతుంది. ఈ మార్గంలో ప్రతిరోజూ సర్వీసు నడపాలంటే కనీసం రెండు రైలు సెట్లు (రేకులు) అందుబాటులో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

లాంచ్‌కు ముందు ట్రయల్ రన్స్..

రైలు షెడ్యూల్‌ను ఖరారు చేసే ముందు ప్రయోగాత్మక పరీక్షలు (ట్రయల్​ రన్స్​) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ) వ్యవస్థ కలిగిన రెండు వందే భారత్ రేకులను ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేసుకున్న హసన్-తోకూరు (మంగళూరు) సెక్షన్‌లో విద్యుత్ వ్యవస్థ (ఓహెచ్​ఈ) ధృవీకరణ పూర్తయిన తర్వాతే ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More