దక్షిణ మధ్య రైల్వే కుదింపు - త్వరలోనే విశాఖ రైల్వే జోన్...!
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం(కొత్త డివిజన్) డివిజన్లు ఉంటాయి.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే అపాయింటెడ్ డేను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త రైల్వే జోన్ లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లతో పాటు కొత్తగా ఏర్పాటు కాబోయే విశాఖపట్నం(కొత్త డివిజన్) డివిజన్లు ఉంటాయి. కొత్త రైల్వే జోన్ అమల్లోకి వస్తే…. ప్రస్తుతం 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కొన్ని తగ్గిపోతాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లకే పరిమితమవుతుంది.
ఇప్పటికే కొత్త జోన్కు సంబంధించిన కీలకమైన నియామకాలను బోర్డు దశలవారీగా పూర్తి చేస్తోంది. పునర్విభజనలో భాగంగా కొన్ని మార్పులు వస్తాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు - వాడి మధ్య 108 కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్లో ఉన్న విష్ణుపురం-పగిడిపల్లి,విష్ణుపురం-జాన్పహాడ్ మార్గాలు కలిపి మొత్తం 142 కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ కానున్నాయి.
మోటుమర్రి-కొండపల్లి రైలు మార్గం(46 కిలోమీటర్ల) సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ నెలాఖరుకల్లా కొత్త రైల్వే జోన్ అపాయింటెడ్ డేపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై కూడా అధికారికంగా ప్రకటన వస్తే… మరింత స్పష్టత రానుంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే జోన్. 2019 ఫిబ్రవరి 27వ తేదీన విశాఖ వేదికగా ఈ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం వేదికగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త జోన్లో దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లో సగాన్ని విలీనం చేసింది.
విజయవాడ డివిజన్లో 959 కి.మీ.లు, గుంతకల్లు డివిజన్లో 1,354 కి.మీ.లు, గుంటూరు డివిజన్లో 628 కి.మీ.లు మొత్తం కలిపి 2,931 కి.మీ. పరిధి ఉంది. ఇక వాల్తేరు డివిజన్ పరిధి 1,106 కి.మీ లోని సగం 600 కి.మీలు కొత్త జోన్లో కలపనున్నారు. మొత్తంగా సౌత్ కోస్టు రైల్వే జోన్ పరిధి 3,500 కి.మీల వరకు ఉండనుంది.

E-Paper












