MBBS Course Duration : వైద్య విద్యార్థులకు పెద్ద ఊరట.. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఇక 10 ఏళ్ల సమయం!

MBBS 10 years : వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే విధంగా ఎన్​ఎంసీ ఒక కీలక ప్రతిపాదన చేసింది. ఎంబీబీఎస్​ని ప్రస్తుతం 9ఏళ్లల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ దానిని 10ఏళ్లకు పెంచాలని ఎన్​ఎంసీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 2, 2026, 06:43:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగించే కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ). ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు తప్పనిసరి రొటేటరీ మెడికల్ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడానికి అనుమతించే గరిష్ట కాలపరిమితిని.. ప్రస్తుతం ఉన్న 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించాలని ఎన్‌ఎంసీ ప్రతిపాదించింది. 'గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ (జీఎంఈఆర్) 2023' కి సవరణలు చేస్తూ తెచ్చిన ఈ కొత్త డ్రాఫ్ట్ రూల్ ద్వారా అనారోగ్యం, కుటుంబ అత్యవసర పరిస్థితులు లేదా ఇతర ఊహించని కారణాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయిన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఎంబీబీఎస్ కోర్సు డ్యురేషన్.. 10ఏళ్లు!
ఎంబీబీఎస్ కోర్సు డ్యురేషన్.. 10ఏళ్లు!

ఎన్‌ఎంసీ ప్రతిపాదన ఏంటి?

నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసిన సరికొత్త డ్రాఫ్ట్ సవరణ నిబంధనల ప్రకారం.. వైద్య విద్యార్థులు తమ కోర్సులో చేరిన తేదీ నుంచి గరిష్టంగా 10 సంవత్సరాలలోపు ఈ కింది ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది:

ఎంబీబీఎస్​కి సంబంధించిన పూర్తి సిలబస్ / కరికులం.

తప్పనిసరిగా చేయాల్సిన కాంప్లసరీ రొటేటరీ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్​ఎంఐ).

గతంలో (జూన్ 2023 నిబంధనల ప్రకారం) ఈ గరిష్ట కాలపరిమితిని 10 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గించారు. అయితే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే, పాత 10 సంవత్సరాల గడువు మళ్లీ పునరుద్ధరించినట్టు అవుతుంది. దీనివల్ల నిబంధనల గడువు దాటిపోతుందనే భయంతో ఉండే విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

మారని నిబంధనలు ఏవి?

కోర్సు పూర్తి చేయడానికి అదనంగా ఒక సంవత్సరం సమయం ఇస్తున్నప్పటికీ, వైద్య విద్యా ప్రమాణాల, పరీక్షల కఠినత్వం విషయంలో ఎన్‌ఎంసీ ఎలాంటి రాజీ పడలేదు.

ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పరిమితి: మొదటి సంవత్సరానికి సంబంధించిన 'ఫస్ట్ ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్' పాస్ అవ్వడానికి విద్యార్థులకు గతంలో లాగే కేవలం గరిష్టంగా 4 అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఎలాంటి సడలింపు లేదు.

హాజరు, అకాడమిక్స్: విద్యార్థులు కాలేజీకి హాజరు కావడం, నిర్దేశిత క్లినికల్ ట్రైనింగ్ నిబంధనలను యథావిధిగా పాటించాల్సి ఉంటుంది.

ఈ అదనపు సంవత్సరం ఎవరికి ఉపయోగపడుతుంది?

  • తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారికి.
  • కుటుంబంలో అత్యవసర పరిస్థితులు ఎదురై విరామం తీసుకునేవారికి.
  • పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల అకాడమిక్ బ్రేక్ పడిన విద్యార్థులకు.
  • ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ సమయంలో అనుకోని అడ్డంకులు ఎదుర్కొనేవారికి.

నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ప్రస్తుతానికి ఇది కేవలం ఒక డ్రాఫ్ట్ ప్రతిపాదన మాత్రమే. ఎన్‌ఎంసీ ఈ నిబంధనపై మెడికల్ కాలేజీలు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, సలహాలను (ఫీడ్​బ్యాక్) ఆహ్వానించింది. ఈ కన్సల్టేషన్ పీరియడ్‌లో వచ్చే అభిప్రాయాలను సమీక్షించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

ఈ నిర్ణయం వైద్య విద్య నాణ్యతను దెబ్బతీయకుండా, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు ఒక 'సేఫ్టీ నెట్' (రక్షణ కవచం) లా పనిచేస్తుందని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More