Odisha tragedy : తీవ్ర విషాదం! ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 10మంది మృతి..
Odisha fire accident : ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ట్రౌమా కేర్ యూనిట్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు.
ఒడిశాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది! కటక్ ఎస్సీబీ ఆసుపత్రికి చెందిన ట్రౌమా కేర్ విభాగంలోని ఐసీయూలో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఐసీయూలో విషమ పరిస్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్నారు. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి, 10మంది ప్రాణాలు కోల్పోయారు!

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..
సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30- 3:00 గంటల మధ్య ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాగా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సీఎం పర్యటన - తక్షణ ఆదేశాలు..
ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం, బాధితులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
"మొత్తం 23 మంది రోగులను ఇతర విభాగాలకు తరలించాము. అయితే, ఇతర ఐసీయూలు, వార్డులకు తరలిస్తున్న సమయంలోనే ఏడుగురు సీరియస్ పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మరో ముగ్గురు మరణించారు," అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివరించారు.
ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?
ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని సీఎం మీడియాకు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అధికారిక దర్యాప్తునకు ఆదేశించారు.
ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- భారీ ఎక్స్గ్రేషియా ప్రకటన..
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు పీటీఐ నివేదించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


