Rape case : ముందు ప్రియుడు, ఆ తర్వాత అపరిచితుడు.. యువతిపై రెండుసార్లు అత్యాచారం- భవనం నుంచి తోసేయడంతో మృతి!

ఒడిశా పారాదీప్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారానికి గురై, ఆపదలో ఉన్న ఒక  యువతిని ఆదుకోవాల్సిన చోట, ఓ కామాంధుడు ఆమె ప్రాణాలనే బలితీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఒకవైపు, సాయం చేస్తానని వచ్చిన అపరిచితుడు మరోవైపు ఆమెపై పైశాచికంగా ప్రవర్తించారు.

Published on: Feb 28, 2026, 08:30:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒడిశా జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్​లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. 23 ఏళ్ల యువతిపై ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు చోట్ల అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒడిశాలో యువతిపై ఒకే రోజు రెండుసార్లు అత్యాచారం..
ఒడిశాలో యువతిపై ఒకే రోజు రెండుసార్లు అత్యాచారం..

ఒడిశాలో యువతిపై అత్యాచారం- ఏం జరిగింది?

జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ అంకిత్ కుమార్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. బాధితురాలు (23) తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అతను చెప్పినట్లే ఒక ఆలయానికి చేరుకుంది. అయితే, ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ప్రియుడు, అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి రహమా బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యాడు.

ఒడిశాలో యువతిపై అత్యాచారం- సాయం పేరిట మరో దారుణం..

దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ వద్ద వేచి ఉన్న ఆ యువతిని చూసి జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి మోటార్‌సైకిల్‌పై అక్కడికి వచ్చాడు. సాయం చేస్తానని నమ్మబలికి ఆమెను పారాదీప్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ భవనం పైకప్పు మీద ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం తన దారుణం బయటపడుతుందనే భయంతో ఆమెను నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు.

తీవ్ర గాయాలపాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది.

పోలీసుల దర్యాప్తు..

యువతి కనిపించడం లేదని ఆమె సోదరుడు ఫిబ్రవరి 22నే తిర్టోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులిద్దరినీ గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం హత్య కేసులు (బీఎన్​ఎస్​ సెక్షన్ల కింద) నమోదు చేశారు.

రాజకీయ దుమారం..

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "ఇంకా ఎంతమంది అమాయక ప్రాణాలు బలి కావాలి? రాష్ట్రంలో చట్టం ఉందా లేదా?" అని ఆయన ఎక్స్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళా భద్రతపై ప్రభుత్వం కేవలం ఉపన్యాసాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన విమర్శించారు.

నమ్మించి మోసం చేసిన ప్రియుడు, ఆపదలో ఆదుకోవాల్సిన అపరిచితుడు.. ఇద్దరూ రాక్షసుల్లా మారడంతో ఒక యువతి ప్రాణం గాలిలో కలిసిపోయింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More