ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్

తాప్సీ పన్ను, కని కుస్రుతి ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌ రూమ్ డ్రామా ‘అస్సీ’ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఇందులో అత్యాచార బాధితురాలిగా నటించిన మలయాళ నటి కని కుస్రుతి తన పాత్ర గురించి, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Feb 19, 2026 11:46 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బలమైన సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు అనుభవ్ సిన్హా శైలే వేరు. ‘ముల్క్’, ‘ఆర్టికల్ 15’, ‘థప్పడ్’ వంటి చిత్రాల తర్వాత ఆయన నుంచి వస్తున్న మరో మూవీ ‘అస్సీ’ (Assi). ఒక దారుణమైన అత్యాచార కేసులో న్యాయం కోసం ఇద్దరు మహిళలు వ్యవస్థతో చేసే పోరాటమే ఈ సినిమా.

ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్
ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో వేధింపులు- అత్యాచార బాధితురాలిగా నటించడమే సులభం- మలయాళ నటి కని కుస్రుతి కామెంట్స్

నిజ జీవితం కంటే నటనే సులభం

ఇందులో న్యాయవాదిగా హీరోయిన్ తాప్సీ పన్ను నటించగా, అత్యాచార బాధితురాలిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదలకు ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన కని కుస్రుతి తన పాత్ర తాలూకు మానసిక స్థితిని వివరించారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన పాత్రలు చేస్తున్నప్పుడు నటీనటులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, కని కుస్రుతి మాత్రం భిన్నంగా స్పందించారు.

"నిజం చెప్పాలంటే, భారతదేశంలో దాదాపు ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొనే ఉంటుంది. అలాంటప్పుడు, ఒక నటిగా ఆ పాత్రలో నటించడం కంటే, ఈ సమాజంలో ఒక మహిళగా రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడమే నాకు ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. జరగని దానిని కెమెరా ముందు చేయడం కంటే, ఇక్కడ జీవించడమే పెద్ద పోరాటం" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కని కుస్రుతి.

షూటింగ్ సమయంలో భయపడిన తోటి నటులు

అస్సీ సినిమాలోని అత్యంత కఠినమైన అత్యాచార సన్నివేశాల చిత్రీకరణ గురించి కని కుస్రుతి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "ఆ సన్నివేశంలో విలన్లుగా నటించిన నా తోటి నటులు ఆ సీన్ చేయాలంటేనే ఎంతో భయపడిపోయారు. వారి భయాన్ని చూసినప్పుడు వారు నిజంగానే నటిస్తున్నారని నాకు అర్థమైంది. నిజానికి, బయటి సమాజంలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎదురయ్యే భయం కంటే, ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుతున్న ఒక సినిమాలో భాగమవ్వడం నాకు చాలా ఉపశమనాన్ని ఇచ్చింది" అని కని కుస్రుతి వివరించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఇకపోతే అస్సీ సినిమాలో తాప్సీ పన్ను ఒక ధైర్యవంతురాలైన లాయర్‌గా కనిపిస్తుండగా.. మహమ్మద్ జీషన్ అయ్యూబ్, కుముద్ మిశ్రా, సుప్రియా పాఠక్, మనోజ్ పహ్వా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు.

దీనికి తోడు నసీరుద్దీన్ షా, దివ్య దత్తా అతిథి పాత్రల్లో ఈ చిత్రంలో మెరవనున్నారు. గౌరవ్ సోలంకి ఈ చిత్రానికి కథను అందించగా, టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించారు. అస్సీ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.