బేబీకి 11 ఏళ్లు.. తాప్సీ పన్ను కామెంట్స్తో రచ్చ రచ్చ! ధురంధర్పై సెటైర్లు అంటూ మండిపడుతున్న నెటిజన్లు!
నీరజ్ పాండే స్పై థ్రిల్లర్ ‘బేబీ’ విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరోయిన్ తాప్సీ పన్ను ఓ ట్వీట్ చేసింది. అయితే, ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. స్పై సినిమాల ట్రెండ్ లేని కాలంలోనే తాము ఈ సినిమా చేశామన్న ఆమె మాటలు ధురంధర్పై సెటైర్లు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.
బాలీవుడ్ సెన్సేషనల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బేబీ’ విడుదలై అప్పుడే 11 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ తాప్సీ పన్ను సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఆమె చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
బేబీకి 11 ఏళ్లు.. తాప్సీ పన్ను కామెంట్స్తో రచ్చ రచ్చ! ధురంధర్పై సెటైర్లు అంటూ మండిపడుతున్న నెటిజన్లు!
ఏం జరిగిందంటే?
టీ-సిరీస్ సంస్థ ‘బేబీ’ 11 ఏళ్ల వేడుకను పురస్కరించుకుని ఒక వీడియోను షేర్ చేసింది. దీన్ని రీ-ట్వీట్ చేస్తూ తాప్సీ.. "11 ఏళ్లు గడిచాయి.. అప్పట్లో స్పై సినిమాలు (గూఢచారి కథలు) ప్రతి శుక్రవారం వచ్చే ట్రెండ్ కాదు. కాలం గడిచేకొద్దీ మరింత వన్నె తెచ్చుకునే ఇలాంటి గొప్ప సినిమాలో చిన్న భాగమైనందుకు గర్వపడుతున్నాను" అని రాసుకొచ్చారు.
నిజానికి 2015లో విడుదలైన ‘బేబీ’ చిత్రంలో తాప్సీ ‘షబానా ఖాన్’ అనే అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో మెరిశారు. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ వల్లే 2017లో ‘నామ్ షబానా’ అనే ప్రత్యేక సినిమా కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు తాప్సీ పన్ను కామెంట్స్ పెద్ద రచ్చ చేస్తున్నాయి.
నెటిజన్ల ఆగ్రహం
తాప్సీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. స్పై సినిమాల ట్రెండ్ పెద్దగా లేనప్పుడే బేబీ లాంటి సినిమా చేశాం అన్నట్లుగా తాప్సీ ట్వీట్ ఉందని, ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన రణ్వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ లేదా వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ను ఉద్దేశించే తాప్సీ ఈ ‘ట్రెండ్’ కామెంట్స్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
మానసిక స్థితి అంటూ
"మీ సొంత పనిని పొగుడుకోవడానికి ఇతరుల విజయంపై అసూయ పడాల్సిన అవసరం లేదు. మీ మానసిక స్థితిని ఇది తెలియజేస్తోంది" అని ఒకరు ట్వీట్ చేయగా, "దురంధర్ సక్సెస్ చూసి మీకు మండుతున్నట్టుంది" అని మరొకరు ఎద్దేవా చేశారు.
మరికొందరు మాత్రం తాప్సీ వైఆర్ఎఫ్ స్పై సినిమాలపై సెటైర్లు వేశారని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తాప్సీ చేసిన ఈ 'ఓల్డ్ వైన్' కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.
తాప్సీ తదుపరి చిత్రాలు
ఇదిలా ఉంటే, గత ఏడాది ‘ఖేల్ ఖేల్ మే’లో కనిపించిన తాప్సీ పన్ను ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాప్సీ నటించిన ‘అస్సీ’ (Assi) చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది.
వీటితో పాటు ‘వో లడ్కీ హై కహా?’, ‘గాంధారి’ చిత్రాల్లోనూ తాప్సీ పన్ను నటిస్తున్నారు. మరోవైపు, ‘ధురంధర్’కు సీక్వెల్ ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కాబోతోంది.