సౌత్ హీరోయిన్ అని చులకనగా చూసేవారు, ఒక మూసలో బంధించారు.. బాలీవుడ్ తీరుపై రెజీనా కసాండ్ర ఆవేదన

Regina Cassandra About Bollywood: దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా బాలీవుడ్ ఎంట్రీ సమయంలో ఎదుర్కొన్న వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పరిశ్రమలో తనను తక్కువ చేసి చూశారని, స్టీరియోటైపింగ్ వల్ల ఇబ్బందులు పడ్డానని రెజీనా కసాండ్రా ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Feb 17, 2026, 08:36:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్, కోలీవుడ్‌లో ఒక దశాబ్దానికి పైగా తనదైన నటనతో అలరించిన బ్యూటిపుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. అనంతరం 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రంతో హిందీ తెరకు పరిచయమయ్యారు రెజీనా కసాండ్రా.

సౌత్ హీరోయిన్ అని చులకనగా చూసేవారు, ఒక మూసలో బంధించారు.. బాలీవుడ్ తీరుపై రెజీనా కసాండ్ర ఆవేదన
సౌత్ హీరోయిన్ అని చులకనగా చూసేవారు, ఒక మూసలో బంధించారు.. బాలీవుడ్ తీరుపై రెజీనా కసాండ్ర ఆవేదన

చెన్నైకి చెందిన ఈ హీరోయిన్ షూటింగ్ సెట్‌ను తన సొంత ఇల్లుగా భావిస్తారట. అయితే, ఒక దక్షిణాది నటిగా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం తనకు అంత సులభం కాలేదని, హిందీ చిత్రసీమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా రెజీనా కసాండ్రా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.

భాష వచ్చినా.. భావంలో వివక్షే!

బాలీవుడ్ పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా కసాండ్రా మనసు విప్పారు. "నేను ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్‌ని కాబట్టి నన్ను ఒక మూసలో (Stereotype) బంధించారు" అని రెజీనా కసాండ్రా తెలిపారు.

"నిజానికి చాలామంది దక్షిణాది వారితో పోలిస్తే నా హిందీ చాలా బాగుంటుంది. నేను హిందీ చదవగలను, రాయగలను, అద్భుతంగా మాట్లాడగలను. ఇప్పటివరకు నేను చేసిన హిందీ ప్రాజెక్టులన్నింటికీ నా సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నాను. అయినా సరే, నన్ను అక్కడ ఒక పరాయి వ్యక్తిలా చూశారు" అని రెజీనా కసాండ్రా వాపోయారు.

ప్రవర్తనతో కించపరిచారు

కేవలం మాటలతోనే కాకుండా, కొందరు తమ ప్రవర్తనతో కూడా తనను కించపరిచారని రెజీనా ఆవేదన వ్యక్తం చేశారు. "చాలామంది నన్ను చాలా చులకనగా చూశారు. కొన్ని సందర్భాల్లో నన్ను తక్కువ చేసి చూపిస్తున్నారని నాకు స్పష్టంగా అర్థమయ్యేది. దానివల్ల ఉత్తరాది ప్రాజెక్టుల విషయంలో నాలో కొంత సంకోచం కలిగింది. అయితే అందరూ అలా ఉంటారని నేను అనను" అని రెజీనా కసాండ్రా వివరించారు.

గ్లామర్ ప్రపంచంలో మూస పద్ధతులు

కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, కమర్షియల్ సినిమాలో మహిళా నటీమణులను కేవలం అందచందాలకే పరిమితం చేయడంపై కూడా రెజీనా స్పందించారు.

"సినిమా అనేది విజువల్ మీడియం కాబట్టి, ఒక నటిని ఒకే రకమైన పాత్రలో చూస్తే ప్రేక్షకుల మనసులో అదే ముద్ర పడిపోతుంది. కానీ నాకు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఉంటుంది. అందుకే కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా, నా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడం నాకు సవాలుగా మారింది" అని రెజీనా కసాండ్రా తెలిపారు.

నేర్చుకోవడం.. మర్చిపోవడం..

16 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన రెజీనా కసాండ్రా ఇప్పుడు 35 ఏళ్ల వయసులో జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తున్నారు. "ఈ పరిశ్రమలో ఉంటూ ప్రశాంతంగా ఉండటం అంత సులభం కాదు. కొన్ని విషయాలను మనకు తెలియకుండానే మనం బలంగా నమ్ముతాం. గత కొన్నేళ్లుగా నేను చాలా నేర్చుకున్నాను, కొన్ని అనవసరమైన విషయాలను మర్చిపోయాను (Unlearning). ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది" అంటూ రెజీనా తన ప్రయాణాన్ని వివరించారు.

రెజీనా ఓటీటీ సిరీస్‌లు

కాగా, రెజీనా కసాండ్రా ‘రాకెట్ బాయ్స్’, ‘ఫర్జీ’ ఓటీటీ సిరీస్‌లతోపాటు ‘జాట్’ వంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన చుట్టూ ఉన్నవారితో స్నేహపూర్వకంగా ఉంటూ, ఏ పరిశ్రమలో ఉన్నా దాన్ని తన ఇల్లుగా మార్చుకోవడమే తన విజయ రహస్యమని రెజీనా కసాండ్రా చెబుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More