...
...
Next Story

HPCL, BPCL, IOC: ఆయిల్ స్టాక్స్‌పై ఎందుకంత ఒత్తిడి? చమురు ధరలు ఎందుకు పెరిగాయి?

ప్రపంచ ముడి చమురు ధరలు (బ్రెంట్ క్రూడ్) 3.53% పెరగడంతో, భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన HPCL, BPCL, IOC షేర్లు 4% వరకు పతనమయ్యాయి. అమెరికా, యూకే విధించిన కొత్త ఆంక్షల కారణంగా భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను సమీక్షిస్తుండటం, సరఫరా ఆందోళనలు పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

Published on: Oct 23, 2025, 15:12:54 IST
Advertisement

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3% పెరగడంతో, HPCL, BPCL, ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) షేర్లు 4% వరకు పతనమయ్యాయి.

HPCL, BPCL, IOC: ఆయిల్ స్టాక్స్‌పై ఎందుకంత ఒత్తిడి? చమురు ధరలు ఎందుకు పెరిగాయి? (Photo: Reuters)
HPCL, BPCL, IOC: ఆయిల్ స్టాక్స్‌పై ఎందుకంత ఒత్తిడి? చమురు ధరలు ఎందుకు పెరిగాయి? (Photo: Reuters)

ఈరోజు (గురువారం) దేశీయ స్టాక్ మార్కెట్‌లో చమురు కంపెనీల షేర్లు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. ముడి చమురు (Crude Oil) ధరలు ప్రపంచ మార్కెట్‌లో 3 శాతం కంటే ఎక్కువ పెరగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) షేర్లు పతనమయ్యాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ఈ పతనానికి ప్రధాన కారణం.

HPCL షేరు ధర 4.06% పడిపోయి ఒక్కో షేరు 437.00కి చేరుకుంది. అలాగే, BPCL షేర్లు 2.66% తగ్గి 330.00 వద్ద, ఇండియన్ ఆయిల్ (IOC) షేరు ధర 2.58% తగ్గి 150.05 వద్ద ట్రేడ్ అయ్యాయి. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (MRPL) షేర్లు సైతం 4.02% పతనమై 144.40 వద్దకు చేరాయి. నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ సూచీ కూడా దాదాపు 0.5% తగ్గింది.

ఆయిల్ స్టాక్స్ ఎందుకు పడిపోయాయి?

పెరిగిన ముడి చమురు ధరల కారణంగానే చమురు షేర్లలో అమ్మకాలు పెరిగాయి. ముడి చమురు ధరలు పెరిగితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్జిన్‌లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ కంపెనీలు చమురును కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది, కానీ వినియోగదారులకు విక్రయించే ధరలను వెంటనే పెంచడానికి వీలుండదు. దీనివల్ల లాభాల మార్జిన్‌లు తగ్గుతాయని ఇన్వెస్టర్లు భయపడతారు.

ముడి చమురు ధరల పెరుగుదలకు కారణాలు:

1. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై సమీక్ష:

ముడి చమురు ధరలు మళ్లీ పెరగడానికి ప్రధాన కారణం... భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను సమీక్షిస్తున్నట్లు వార్తలు రావడం. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాకు చెందిన ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థలు రోస్‌నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే భారతీయ రిఫైనరీలు అప్రమత్తమయ్యాయి.

2. పశ్చిమ దేశాల ఆంక్షలు:

దీంతో బ్రెంట్ ముడి చమురు ధరలు 3.53% పెరిగి బ్యారెల్‌కు $64.80కి చేరాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ సైతం 3.57% లాభపడి $60.59కి పెరిగాయి.

భారతీయ దిగుమతులపై ప్రభావం

భారతదేశం రష్యా చమురు దిగుమతులను ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 40% తగ్గిస్తుందని, చివరకు దాదాపు సున్నాకు దశలవారీగా తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కొత్త ఆంక్షలకు ప్రతిస్పందనగా భారతీయ రిఫైనరీలు రష్యా క్రూడ్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం ఈ దిగుమతులను తగ్గించాలని లేదా పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. “రష్యా చమురు దిగుమతులను సర్దుబాటు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. రిలయన్స్ భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటుంది” అని తెలిపారు.

HPCL, BPCL, IOC వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలు సాధారణంగా రోస్‌నెఫ్ట్ లేదా లుకోయిల్ నుంచి నేరుగా చమురు కొనుగోలు చేయవు. బదులుగా, అవి మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తాయి. అయితే, అమెరికా ఆంక్షల కారణంగా చమురు సరఫరాలో పెద్ద అంతరాయం కలుగుతుందనే అనుమానాలు మార్కెట్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అనిశ్చితి కారణంగానే ముడి చమురు ధరలు మరింత పెరగకుండా అడ్డుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి మాత్రమే, హిందుస్తాన్ టైమ్స్‌వి కావు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు మేం సలహా ఇస్తున్నాం.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe