ఆపరేషన్ సిందూర్: పాక్ ఎందుకు తలవంచింది? ఆర్మీ చీఫ్ వెల్లడించిన ఆ 2 కీలక మలుపులు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చిందో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వివరించారు. 22 నిమిషాల మెరుపు దాడి, మున్ముందు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టడమే పాక్ లొంగుబాటుకు ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు.
గతేడాది జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో భారత సైన్యం సాధించిన అద్భుత విజయంపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వార్షిక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ కాల్పుల విరమణకు రావడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఈ పోరాటంలో భారత్ విజయం సాధించడంలో రెండు ప్రధాన ఘట్టాలు 'టర్నింగ్ పాయింట్లు'గా నిలిచాయని ఆయన విశ్లేషించారు.

మొదటి మలుపు: 22 నిమిషాల మెరుపు దాడి
భారత సైన్యం 2025, మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
"ఆ 22 నిమిషాల మెరుపు దాడి మొదటి కీలక మలుపు. ఆ సమయంలో అవతలి వైపు ఉన్న వారి నిర్ణయాత్మక శక్తి (Decision making cycle) పూర్తిగా కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక వారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు" అని ఆర్మీ చీఫ్ వివరించారు.
భారత సైన్యం తన లక్ష్యాలను చేరుకున్నాక యుద్ధాన్ని పొడిగించకూడదని నిర్ణయించుకుందని, కానీ పాక్ వైపు మాత్రం తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన తెలిపారు. భారత దాడుల నుంచి తేరుకున్నాక వారు రాళ్లు, డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడికి ప్రయత్నించినా, భారత్ ఆచితూచి స్పందించిందని (Calibrated response) ద్వివేది పేర్కొన్నారు.
రెండో మలుపు: మే 10 నాటి రహస్య ఆదేశాలు
యుద్ధం మరింత తీవ్రమైతే ఎలా స్పందించాలనే దానిపై 2025, మే 10 ఉదయం భారత త్రివిధ దళాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయని జనరల్ ద్వివేది వెల్లడించారు.
"రెండో మలుపు గురించి నేను బహిరంగంగా అన్నీ వెల్లడించలేను. కానీ మే 10 ఉదయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు అందిన కొన్ని ఆదేశాలు యుద్ధ గతిని మార్చేశాయి. ఆ సందేశం ఎవరికి చేరాలో వారికి స్పష్టంగా అర్థమైంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
శాటిలైట్ చిత్రాలతో వణికిపోయిన పాక్!
భారత యుద్ధ విమానాలు, నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు ఎక్కడికి చేరుకుంటున్నాయో పాకిస్తాన్ తన శాటిలైట్ చిత్రాల ద్వారా గమనించిందని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఆ చిత్రాలను విశ్లేషించుకున్న పాక్ నాయకత్వం.. భారత్ తదుపరి వేయబోయే అడుగు ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో ముందే ఊహించిందని, అందుకే వెంటనే యుద్ధాన్ని ఆపివేయడమే తమకు లాభదాయకమని వారు భావించారని ఆయన వివరించారు.
రాజకీయ నాయకత్వం ఇచ్చిన స్పష్టమైన దిశానిర్దేశం, త్రివిధ దళాల మధ్య ఉన్న సమన్వయమే (Tri-service synergy) ఈ ఆపరేషన్ విజయానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. 2025లో 'ఆత్మనిర్భరత, ఆవిష్కరణ' దిశగా భారత సైన్యం సాధించిన పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

E-Paper












