Petrol diesel hike : లీటరు పెట్రోల్​, డీజిల్​ ధరలపై రూ. 20 పెంపు! బంకుల్లో ‘ప్యానిక్​ బయ్యింగ్’..

Petrol diesel price hike : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయనే ప్రచారం సామాన్యుల్లో కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు.

Published on: May 15, 2026, 05:27:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో ఇంధన ధరల మోత తప్పదా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం, చమురు మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌లో ఇంధన సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఇప్పటివరకు నిలకడగా ఉన్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

పెట్రోల్​ డీజిల్​ ధరలపై రూ. 20 పెంపు! (Ashok Munjani)
పెట్రోల్​ డీజిల్​ ధరలపై రూ. 20 పెంపు! (Ashok Munjani)

ఈ నేపథ్యంలోనే ఉత్తర భారతంలోని దిల్లీ-ఎన్‌సీఆర్ నుంచి ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ వరకు సుమారు 15 ప్రధాన నగరాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 నుంచి రూ. 20 వరకు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనితో వాహనదారులు తమ ట్యాంకులను నింపుకునేందుకు గురువారం క్యూ కట్టారు.

ఢిల్లీ: జాతీయ ప్రయోజనం వర్సెస్ సామాన్యుడి బడ్జెట్!

దేశ రాజధానిలో ప్రజల అభిప్రాయాలు రెండుగా విడిపోయాయి. "దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే స్వల్ప ధరల పెంపును భరించాల్సిందే," అని నీరజ్ జైన్ అనే వాహనదారుడు అభిప్రాయపడగా, సామాన్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నామని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడం తమ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోందని వాపోతున్నారు.

అల్వార్: ‘నో ఫ్యూయల్’ బోర్డుల కలకలం!

రాజస్థాన్‌లోని అల్వార్‌లో పరిస్థితి అప్పుడే విషమించింది. పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ‘నో పెట్రోల్’, ‘నో డీజిల్’ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ పెట్రోల్‌పై రూ. 15, డీజిల్‌పై రూ. 20 వరకు పెరగవచ్చని జనం భయపడుతున్నారు.

గురుగ్రామ్: దశలవారీ పెంపు ఉండవచ్చా?

చమురు కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయని గురుగ్రామ్ పెట్రోల్ పంప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ యాదవ్ పేర్కొన్నారు. ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ భారాన్ని ఒకేసారి ప్రజలపై వేయకుండా విడతల వారీగా పెంచే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

పట్నా: ‘కొనక తప్పదు.. కానీ సరఫరా కావాలి’

బీహార్ రాజధాని పట్నాలో ప్రజలు వాస్తవిక ధోరణిలో స్పందించారు. "పెట్రోల్ కొనడం మాకు తప్పనిసరి. ధర పెరిగినా కొంటాం, కానీ కనీసం స్టాక్ అయినా అందుబాటులో ఉంచండి," అని వారు కోరుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, రవాణా రంగంపై ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

నోయిడా అండ్ ఫరీదాబాద్: పొదుపు మంత్రం!

నోయిడాలో ప్రస్తుతానికి సరఫరా సాధారణంగానే ఉన్నా, ఫరీదాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ నష్టపోతోందని, ప్రజలే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని కొందరు సూచిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయని రోహిత్ అనే వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు.

గుజరాత్: సూరత్, మహిసాగర్​లలో క్యూలు!

గుజరాత్‌లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూరత్‌లోని భారత్ పెట్రోలియం బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తుండగా, మహిసాగర్ జిల్లాలో చాలా చోట్ల స్టాక్ నిండుకుంది. సామాన్యులను ఇబ్బంది పెట్టే నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వారణాసి అండ్ కాన్పూర్: సైకిళ్లే దిక్కా?

పెట్రోల్ ధర రూ. 150 కి చేరుతుందనే ఊహాగానాలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జనాన్ని బంకుల వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఇక వారణాసిలో జనం కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. "ధరలు ఇలాగే పెరిగితే ఇక బండి గ్యారేజీలో పెట్టి సైకిల్ తొక్కడమే మార్గం," అని ఒక నివాసి వ్యాఖ్యానించారు.

భువనేశ్వర్: వదంతులను నమ్మవద్దు

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ధరల పెంపుపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని బంక్ మేనేజర్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ వదంతులేనని వారు కొట్టిపారేస్తున్నారు.

పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు, ఊహాగానాల మధ్య సామాన్యుడు మాత్రం ధరల మంట ఎప్పుడు మొదలవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More