కొత్త కారు కొంటున్నారా? పెట్రోల్, డీజిల్ మధ్య ఏది లాభదాయకం? ఆటోమేటిక్ అయితే?
మీరు కొత్త కారు కొంటున్నారా? పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లలో ఏది బెస్ట్? ఆటోమేటిక్ గేర్ బాక్స్ వల్ల మైలేజీ మారుతుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మధ్యతరగతి కుటుంబంలో కారు కొనడం అనేది ఒక భావోద్వేగంతో కూడిన నిర్ణయం. షోరూమ్కు వెళ్ళినప్పుడు మన ముందు కనిపించే మొదటి ప్రశ్న.. "సార్, పెట్రోల్ కావాలా? డీజిల్ కావాలా?". ఒకప్పుడు డీజిల్ కారు అంటే కేవలం మైలేజీ కోసమే కొనేవారు. కానీ, మారుతున్న నిబంధనలు, ఇంధన ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోవడం ఇప్పుడు కారు కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తోంది. దానికి తోడు ఇప్పుడు ఆటోమేటిక్ గేర్ బాక్స్ టెక్నాలజీ (AMT, CVT, Torque Converter) ఈ నిర్ణయాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది.

నేటి పరిస్థితి: పెట్రోల్, డీజిల్ ధరల దోబూచులాట
ఒక ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ. 20 నుంచి 25 వరకు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేడా చాలా రాష్ట్రాల్లో రూ. 5 నుంచి 10 లోపుకు పడిపోయింది. దీనివల్ల డీజిల్ కారు కొని ఇంధన ఖర్చును ఆదా చేయాలనుకునే వారి లెక్కలు మారుతున్నాయి. మరోవైపు బిఎస్-6 (BS6 Phase 2) కఠిన నిబంధనల వల్ల డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చు పెరిగి, కార్ల ధరలు కూడా భారీగా పెరిగాయి.
అసలు డీజిల్ కారు ఎవరికి లాభం?
డీజిల్ కారు కొనాలనే నిర్ణయం కేవలం మీ 'నెలవారీ ప్రయాణం' (Monthly Run) మీద ఆధారపడి ఉండాలి.
- నెలవారీ ప్రయాణం: మీరు నెలకు కనీసం 1,500 నుండి 2,000 కిలోమీటర్లు ప్రయాణించే వారైతేనే డీజిల్ కారు గురించి ఆలోచించాలి.
- హైవే ప్రయాణాలు: మీరు ఎక్కువగా నగరంలో కాకుండా హైవేల మీద లాంగ్ డ్రైవ్స్ చేసే వారైతే డీజిల్ ఇంజిన్ మీకు మంచి పవర్, టార్క్ అందిస్తుంది.
- రీసేల్ వాల్యూ: సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇప్పటికీ డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్లలో డీజిల్ ఇంజిన్లకే ప్రాధాన్యత ఎక్కువ.
పెట్రోల్ కారు ఎప్పుడు మేలు?
- తక్కువ ప్రయాణం: మీ కారు కేవలం ఆఫీస్ పనులకు, వారాంతాల్లో చిన్నపాటి పర్యటనలకు మాత్రమే పరిమితమైతే (నెలకు 1000 కి.మీ లోపు), పెట్రోల్ కారు ఉత్తమం.
- తక్కువ మెయింటెనెన్స్: పెట్రోల్ కార్ల సర్వీసింగ్ ఖర్చు డీజిల్ కార్ల కంటే తక్కువగా ఉంటుంది.
- ఇంజిన్ స్మూత్నెస్: డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే పెట్రోల్ ఇంజిన్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నాయిస్, వైబ్రేషన్స్ చాలా తక్కువ.
ఆటోమేటిక్ గేర్ ఎంచుకుంటే ఏ ఫ్యూయల్ బెటర్?
ప్రస్తుతం ట్రాఫిక్ కష్టాల వల్ల చాలా మంది ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ వల్ల మైలేజీ కొంత తగ్గుతుంది.
- పెట్రోల్ ఆటోమేటిక్: మీరు నగరంలో డ్రైవ్ చేస్తుంటే, పెట్రోల్ ఆటోమేటిక్ (ముఖ్యంగా CVT లేదా AMT) చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే సిటీ ట్రాఫిక్లో మైలేజీ భారీగా తగ్గే అవకాశం ఉంది.
- డీజిల్ ఆటోమేటిక్: మీకు భారీ ప్రయాణాలతో పాటు ఆటోమేటిక్ కంఫర్ట్ కావాలంటే డీజిల్ ఆటోమేటిక్ బెస్ట్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ కంటే మెరుగైన మైలేజీని ఇస్తుంది. కానీ, డీజిల్ కారు ఆన్-రోడ్ ధర పెట్రోల్ కారు కంటే రూ. 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది.
ముఖ్య గమనిక: డీజిల్ ఆటోమేటిక్ కారు కొన్నప్పుడు ఆ అదనపు పెట్టుబడిని ఇంధన ఆదా ద్వారా వెనక్కి తీసుకోవాలంటే మీరు కనీసం 5-6 ఏళ్లు కారును ఎక్కువగా వాడాల్సి ఉంటుంది.
నిపుణుల మాట (Expert Advice)
ఆటో రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం, "డీజిల్ కార్లలో బిఎస్-6 ప్రమాణాల తర్వాత DPF (Diesel Particulate Filter) సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కారును కేవలం తక్కువ దూరాలకు, తక్కువ వేగంతో సిటీలో మాత్రమే వాడితే, డీజిల్ ఫిల్టర్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని క్లియర్ చేయడానికి కారును హైవే మీద వేగంగా నడపాల్సి వస్తుంది. కాబట్టి, వాడకం తక్కువగా ఉన్నవారు అనవసరంగా డీజిల్ కారు వైపు వెళ్లకపోవడమే మంచిది."
అంతిమ నిర్ణయం మీదే
మీరు ఏ కారు కొనాలనేది ఒక చిన్న లెక్కతో తేల్చుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ కారు ధరల మధ్య ఉన్న తేడాను (ఉదాహరణకు రూ. 1.5 లక్షలు) బ్యాంకులో ఎఫ్డీ చేస్తే వచ్చే వడ్డీతో మీ నెలవారీ పెట్రోల్ బిల్లులో కొంత భాగాన్ని కవర్ చేయవచ్చు. ఒకవేళ మీ ప్రయాణం రోజుకు 50-60 కిలోమీటర్ల కంటే తక్కువైతే కళ్ళు మూసుకుని పెట్రోల్ కారు తీసుకోండి. అదే మీరు నిరంతరం హైవేల మీద తిరిగే ట్రావెలర్ అయితే డీజిల్ మీకు నమ్మకమైన నేస్తం.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


