ఇండియాలో 'ప్రాడా' శాండిల్స్ తయారీకి లైన్ క్లియర్ - వచ్చే ఏడాది నుంచి అమ్మకాలు..!

కొల్హాపురి చప్పల్స్‌ వివాదం తర్వాత 'ప్రాడా' వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ హస్తకళల సాకారంతో తయారు చేసే చెప్పులను(శాండిల్స్) మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది.

Published on: Dec 11, 2025 8:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల 'ప్రాడా' అనే ఇటాలియన్ ఫ్యాషన్ కంపెనీ వివాదంలోకి చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్-టో లెదర్ శాండల్స్‌ను ఆవిష్కరించగా… ఈ శాండల్స్ సంప్రదాయ భారతీయ కొల్హాపుర్ చెప్పులను పోలి ఉండటంతో ఈ వివాదం మొదలైంది.

ఇండియన్ మార్కెట్ లోకి 'ప్రాడా' ఎంట్రీ (via REUTERS)
ఇండియన్ మార్కెట్ లోకి 'ప్రాడా' ఎంట్రీ (via REUTERS)

ఈ కంపెనీ తయారు చేసిన శాండల్స్ లో కొల్హాపుర్ చెప్పులకు ఉండే ప్రత్యేకమైన అల్లికతో కూడిన లెదర్ పట్టీలు, ఓపెన్-టో స్టైల్ స్పష్టంగా కనిపించాయి. వీటిని ప్రాడా కంపెనీ 'లెదర్ శాండల్స్' అని మాత్రమే చెప్పింది. భారతీయ మూలాలను లేదా కొల్హాపుర్‌ సంప్రదాయ హస్తకళ అని కూడా అంగీకరించలేదు.

ప్రాడా వ్యవహారించిన తీరుపై భారత్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, హస్త కళాకారుల సంఘాలు, రాజకీయ నాయకులు దుమ్మెత్తిపోశారు.వారసత్వ కళల అపహరణకు పాల్పడిందంటూ నెటిజన్లు కూడా సీరియస్ పోస్టులు చేశారు.

ఈ వివాదం తర్వాత… ప్రాడా కంపెనీ స్పందించింది. తమ డిజైన్‌లు భారత్‌లోని శతాబ్దాల నాటి కొల్హాపుర్ చెప్పుల నుంచి ప్రేరణ పొందాయని ప్రకటించింది. ఇదే విషయంపై మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అగ్రికల్చర్‌కు లేఖ కూడా రాసింది.

క్రెడిట్స్ విషయంలో వివాదం ముగిసిన నేపథ్యంలో ప్రాడా కంపెనీ ఇండియన్ మార్కెట్ లో శాండిల్స్ తయారీకి సిద్ధమైంది. ఇదే విషయంపై ప్రాడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ లోరెంజో బెర్టెల్లి… వార్తా ఏజెన్సీ రాయిటర్స్ తో పలు విషయాలు పంచుకున్నారు. భారతదేశం యొక్క సాంప్రదాయ పాదరక్షల నుంచి ప్రేరణ పొంది మా కంపెనీ ఈ శాండిల్స్ ను తయారు చేయబోతుందని తెలిపారు. ప్రతి జతను సుమారు 800 యూరోలు (డాలర్లు 930) కు విక్రయిస్తుందని పేర్కొన్నారు.

2 వేల జతలు తయారీ…

హస్తకళాకారుల సంఘాలతో చర్చలు జరిగిన ఒప్పందం ప్రకారం…. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో 2 వేల జతల చెప్పులను తయారు చేయాలని ప్రాడా యోచిస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న భారతీయ హస్తకళలతో పాటు ఇటాలియన్ టెక్నాలజీని మిళితం చేయనుంది.

“నిజమైన తయారీదారీ యొక్క ప్రామాణిక సామర్థ్యాలను తీసుకుంటూనే మా కంపెనీ తయారీ పద్ధతులను జోడిస్తాం” అని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బెర్టెల్లి రాయిటర్స్‌తో తెలిపారు.

వీటి అమ్మకాలను ఫిబ్రవరి 2026 నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ప్రాడా స్టోర్లతో పాటు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు.

వివాదం ముగిసిన తర్వాత ప్రాడా కంపెనీ….. సంత్ రోహిదాస్ లెదర్ ఇండస్ట్రీస్ మరియు చార్మాకర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCOM), డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDKAR) తో ఒప్పందం కుదుర్చుకుంది.

“స్థానిక కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి మూడేళ్లకు గానూ ఒప్పందం చేసుకున్నాం. పూర్తి వివరాలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోనూ శిక్షణా కార్యక్రమాలతో పాటు ఇటలీలోని ప్రాడాస్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశాలు ఉంటాయి” అని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బెర్టెల్లి రాయిటర్స్‌తో పేర్కొన్నారు.

ఈప్రాజెక్ట్ మరియు శిక్షణా కార్యక్రమానికి "అనేక మిలియన్ యూరోలు" ఖర్చవుతుందని బెర్టెల్లి చెప్పారు. హస్త కళాకారులకు మంచి వేతనం ఇస్తామని తెలిపారు.

ఈ ఏడాది ఢిల్లీలో తన మొదటి బ్యూటీ స్టోర్ ను ప్రాడా ప్రారంభించింది. అయితే వచ్చే ఏడాది కొత్త రిటైల్ దుస్తుల దుకాణాలు ప్రారంభించే విషయంపై ఎటువంటి ప్రణాళికలు లేవని బెర్టెల్లి చెప్పారు.