బాంకీపూర్ ఉపఎన్నిక రౌండ్ 3: బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం

బీహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 1,162 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Published on: Aug 3, 2026, 11:33:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సోమవారం పాట్నాలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ శుభారంభం చేసింది. మొదటి మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ తన ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

బాంకీపూర్ ఉపఎన్నిక రౌండ్ 3: బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
బాంకీపూర్ ఉపఎన్నిక రౌండ్ 3: బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం

మూడో రౌండ్ లెక్కింపు ఫలితాలు ఇవే

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 31 రౌండ్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసేసరికి ప్రశాంత్ కిషోర్‌కు 5,032 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లు సాధించారు. దీంతో పీకే 1,162 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అభ్యర్థి రేఖా కుమారి 767 ఓట్లతో మూడో స్థానంలో పరిమితమయ్యారు. ఆమె ప్రశాంత్ కిషోర్ కంటే 3,131 ఓట్ల వెనుకబడి ఉన్నారు. జూలై 30న జరిగిన ఈ ఉపఎన్నికల తుది ఫలితం మిగిలిన 28 రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడికానుంది.

బీజేపీ కోటలోనే పీకే సవాల్

పాట్నా సాహిబ్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే బాంకీపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కోటగా ఉంది. 2010 నుంచి ఈ స్థానానికి బీజేపీ నేత నితిన్ నవీన్ ప్రాతినిధ్యం వహించగా, అంతకుముందు ఆయన తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది ఆరంభంలో నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

సాధారణంగా నగర ప్రాంతాల్లో బీజేపీకి ఉండే బలమైన ఓటు బ్యాంకును తట్టుకుని పీకే ముందంజ సాధించడం బీహార్ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.

సేఫ్ సీటు వద్దు.. మార్పే ముఖ్యం

ప్రచార సమయంలో ప్రశాంత్ కిషోర్ తాను సేఫ్ సీటు వెతుక్కోలేదని, కావాలనే బీజేపీ బలంగా ఉన్న స్థానాన్ని ఎంచుకున్నానని చెప్పారు.

"రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులువైన నియోజకవర్గాలను వెతుక్కుంటారు. కానీ బీహార్ మారాలంటే ప్రజలు కులమతాలకు అతీతంగా ఓటేయాలనే సందేశం ఇవ్వడానికే నేను బీజేపీ గెలుస్తూ వస్తున్న క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకున్నాను. లాలూ ప్రసాద్ యాదవ్ వస్తారనే భయంతో బీజేపీకి, బీజేపీ వస్తుందనే భయంతో లాలూకు ఓట్లేసే పద్ధతి స్వస్తి పలకాలన్నదే నా ఉద్దేశం" అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

సుదీర్ఘ కాలంగా రాజకీయ సమీకరణాలను శాసించిన పికి, ఈ ఎన్నికల ఫలితాలు కొత్త ఊపునిస్తాయా లేక మిగిలిన రౌండ్లలో బీజేపీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More