రాష్ట్రీయ సరెండర్ సంఘ్: ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నిప్పులు.. అసలేం జరిగింది?
అమెరికా పర్యటనలో ఆరెస్సెస్ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. భారత్ అమెరికాకు లొంగిపోయిందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంతో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగి "సంఘ్ అసలు స్వరూపం బయటపడింది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
భారత రాజకీయాల్లో జాతీయవాదం చుట్టూ తిరిగే చర్చ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆరెస్సెస్ (RSS) నేత రామ్ మాధవ్ రష్యా చమురు దిగుమతులపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాయి. నాగ్పూర్లో దేశభక్తి గురించి మాట్లాడే సంఘ్ నేతలు, అమెరికా వెళ్తే మాత్రం మోకరిల్లుతారంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్'ను 'రాష్ట్రీయ సరెండర్ సంఘ్' అంటూ ఎద్దేవా చేశారు.

రామ్ మాధవ్ వ్యాఖ్యలు.. వివాదానికి అసలు కారణం
అమెరికాలో జరిగిన ఒక ప్యానెల్ చర్చలో పాల్గొన్న రామ్ మాధవ్.. భారత్-అమెరికా సంబంధాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మైత్రిని కాపాడుకోవడానికి భారత్ చాలా త్యాగాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే రష్యా, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసిందని, అలాగే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ (పన్నుల)ను కూడా భారత్ మారుమాట్లాడకుండా అంగీకరించిందని చెప్పారు. విపక్షాల విమర్శలను సైతం లెక్కచేయకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
"నేను చెప్పింది తప్పు".. రామ్ మాధవ్ క్షమాపణ
రామ్ మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపలేదు సదా కదా, అమెరికా పన్నుల విధింపును కూడా తీవ్రంగా నిరసించింది. తన పొరపాటును గ్రహించిన రామ్ మాధవ్ వెంటనే 'X' (ట్విట్టర్) వేదికగా క్షమాపణలు చెప్పారు. "నేను చెప్పింది వాస్తవ విరుద్ధం. భారత్ ఎప్పుడూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపలేదు. అలాగే 50 శాతం టారిఫ్ విధింపును గట్టిగా వ్యతిరేకించింది. చర్చలో భాగంగా వేరే విషయాన్ని చెప్పబోయి పొరపాటున ఇలా మాట్లాడాను" అని ఆయన వివరణ ఇచ్చారు.
రాహుల్ గాంధీ ఘాటు స్పందన
రామ్ మాధవ్ క్షమాపణలు చెప్పినప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోలేదు. సంఘ్ నేత వ్యాఖ్యలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.
"రాష్ట్రీయ సరెండర్ సంఘ్.. నాగ్పూర్లో నకిలీ జాతీయవాదం, అమెరికాలో మాత్రం బానిసత్వం. రామ్ మాధవ్ మాటలు సంఘ్ అసలు నైజాన్ని బయటపెట్టాయి" అని రాహుల్ రాసుకొచ్చారు. సంఘ్ నేతలు దేశం బయట భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతర్జాతీయ చమురు రాజకీయాలు - భారత్ వ్యూహం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చమురు ధరలను అదుపులో ఉంచడానికి అమెరికా ప్రభుత్వం భారత్ వంటి దేశాలకు రష్యా నుంచి చమురు కొనడానికి 30 రోజుల ప్రత్యేక మినహాయింపు (Waiver) ఇచ్చింది.
ఈ అవకాశాన్ని వాడుకుంటూ భారత్ ఇప్పటికే రష్యా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును ఆర్డర్ చేసింది. గతంలో అమెరికా ఆంక్షల వల్ల రిలయన్స్ వంటి సంస్థలు రష్యా నుంచి దిగుమతులు తగ్గించినప్పటికీ, తాజాగా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల భారత్పై పన్నుల భారం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఇలాంటి క్లిష్టమైన దౌత్యవేత్తల చర్చలు జరుగుతున్న సమయంలో రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


