RBI Monetary policy : వడ్డీ రేట్లు యథాతథం- భారత జీడీపీ వృద్ధి అంచనాలు పెంపు..
వడ్డీ రేట్లను 5.25శాతం వద్ద యథాతంగా ఉంచింది ఆర్బీఐ. మూడు రోజుల మానిటరీ పాలసీ సమావేశం అనంతరం శుక్రవారం ఉదయం ఈ ప్రకటన చేసింది. కాగా జీడీపీ వృద్ధి- ద్రవ్యోల్బణ అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.
రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం ఈ ప్రకటన చేశారు.

ఈ దఫా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25శాతం వద్ద ఉంది. పాలసీ వైఖరీని కూడా న్యూట్రల్లో కొనసాగించింది.
“దేశ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అసెస్ చేసిన తర్వాత, వడ్డీ రేట్లను 5.25శాతం వద్దే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది,” అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
బడ్జెట్ 2026 తర్వాత జరిగిన తొలి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండదు అనే అంచనాలే మార్కెట్లో ఉన్నాయి. ఈసారి రెపో రేట్ కట్ ఉండదని బ్లూమ్బర్గ్ సర్వే చేసిన ఎకనామిస్ట్లలో 39 మంది అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు భారత జీడీపీ పరుగులు తీస్తున్న వేళ.. ఇక మీదట అసలు వడ్డీ రేట్ల కోత అనేదే ఉండదని మరికొందరు అంచనా వేశారు.
ఈసారి రెపో రేట్ కట్ లేకపోయినా.. గతేడాది ఫిబ్రవరి నుంచి చూసుకుంటే వడ్డీ రేట్లను ఆర్బీఐ ఇప్పటికే 125 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గించడం 2019 తర్వాత ఇదే తొలిసారి! చివరిగా, గత డిసెంబర్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల కట్ని ప్రకటించింది. ఫలితంగా, అప్పుడు రెపో రేటు 5.50శాతం నుంచి 5.25శాతానికి దిగొచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది.
భారత దేశ జీడీపీ అంచనాలు పెంపు..
ఎఫ్వై2025-26కి సంబంధించిన భారత దేశ జీడీపీ వృద్ధి అంచనాలను 7.3శాతం నుంచి 7.4శాతానికి పెంచింది ఆర్బీఐ. బడ్జెట్ 2026లో భాగంగా గత వారం వెలువడిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న 6.8శాతం- 7.2శాతం కన్నా ఇది ఎక్కువ.
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్పై కీలక ప్రకటన వెలువడటం దేశానికి సానుకూల విషయాలు అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు.
మరోవైపు ఎఫ్వై2025-26కి సంబంధించిన ద్రవ్యోల్బణ అంచనాలను 2శాతం నుంచి 2.1శాతానికి పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెద్దగా పెరగపోవచ్చని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. కానీ అంతర్జాతీయ అనిశ్చితిపై ఫోకస్ చేయాలని తెలిపారు.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 342 పాయింట్ల నష్టంతో 82,972 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ50.. 129 పాయింట్ల కోల్పోయి 25,515 వద్ద కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












