RBI rate cut : రెపో రేటును కట్ చేసిన ఆర్బీఐ- మరి హోమ్ లోన్ భారం తగ్గుతుందా?
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఫలితంగా అధిక ఈఎంఐల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్బీఐ తాజా నిర్ణయంతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 5.5% నుంచి 5.25%కి తీసుకువచ్చింది. ఈ తాజా రేటు కోతతో 2025లో ఇప్పటివరకు రెపో రేటు తగ్గింపు మొత్తం 125 బేసిస్ పాయింట్లు అయ్యింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను అడ్జెస్ట్ చేయడం ప్రారంభిస్తే, ఈఎంఐ భారం తగ్గుతుందని గృహ కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

రెపో రోటు కోతపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన..
ఆర్థిక పరిస్థితులను సమీక్షించడానికి, ద్రవ్య విధాన చర్యపై ఓటు వేయడానికి ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో సమావేశమైంది. ద్రవ్యోల్బణం ట్రెండ్స్, వృద్ధి అంచనాలు, ద్రవ్య లభ్యత అవసరాలను అంచనా వేసిన తర్వాత, రేట్ల కోతకు కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
"డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎంపీసీ సమావేశమై రెపో రేటుపై చర్చించి, నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులు, దృక్పథాన్ని వివరంగా అంచనా వేసిన తర్వాత, పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకురావడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది," అని మల్హోత్రా పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి లాభమా?
రుణాల ఖర్చులు ఇప్పుడు తగ్గుతాయని భావిస్తున్నందున, ఇప్పుడు చాలా మందికి ఒకే ప్రశ్న ఉంది: హోమ్ లోన్లు చౌకగా మారుతాయా?
అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. ఈ రేటు కోత రియల్ ఎస్టేట్ రంగానికి సానుకూలంగా ఉంటుందని, ముఖ్యంగా గృహ ధరలు బాగా పెరిగిన సమయంలో ఈ నిర్ణయం కీలకమని అన్నారు.
"2025 ముగిసే సమయంలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం భారత రియల్ ఎస్టేట్ రంగానికి స్పష్టమైన సానుకూల అంశం. ఈ ఏడాదిలో ఇదివరకటి సడలింపుల తర్వాత వచ్చిన ఈ చర్య, గృహ కొనుగోలుదారులకు, ముఖ్యంగా వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులకు అత్యంత సున్నితంగా ఉండే సరసమైన, మధ్య-ఆదాయ వర్గాల వారికి, మరింత అనుకూలంగా ఉంటుంది," అని ఆయన చెప్పారు.
బ్యాంకులు ఈ రేటు కోతను త్వరగా రుణగ్రహీతలకు బదిలీ చేస్తే, హోమ్ లోన్ రేట్లు త్వరలో మరింత ఆకర్షణీయమైన స్థాయిలకు పడిపోతాయని పూరి అభిప్రాయపడ్డారు.
“టాప్ 7 నగరాల్లో సగటు గృహ ధరలు 2025లో దాదాపు 10% పెరిగిన నేపథ్యంలో, ఈ రేటు కోత స్థోమతకు కీలకమైన రక్షణను అందిస్తుంది. బ్యాంకులు ఈ రేటు కోతను త్వరగా బదిలీ చేస్తే, 2026 మొదటి త్రైమాసికంలో విక్రయాలు పుంజుకుంటాయని మేము అంచనా వేస్తున్నాము,” అని ఆయన అన్నారు.
ధరలు పెరుగుతున్న కారణంగా వేచి చూస్తున్న కొందరు కొనుగోలుదారులను ఈ కోత తిరిగి మార్కెట్లోకి తీసుకురావడానికి సహాయపడుతుందని, అయితే లగ్జరీ గృహాలు మాత్రం డిమాండ్ను నడిపించడం కొనసాగిస్తాయని ఆయన జోడించారు.
ట్రైబెకా డెవలపర్స్ గ్రూప్ సీఈఓ రజత్ ఖండేల్వాల్ కూడా ఇలాంటి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. అధిక ధరలు ఉన్న మార్కెట్లలో గృహ కొనుగోలుదారులపై ఉన్న ఒత్తిడిని ఈ రేట్ కట్ తగ్గిస్తుందని ఆయన అన్నారు.
"ఆర్బీఐ రెపో రేటును 5.25%కి తగ్గించడం స్వాగతించదగిన చర్య. ఇది గృహ కొనుగోలుదారులకు, ముఖ్యంగా ఎంఎంఆర్, ఎన్సీఆర్, పూణే వంటి ప్రీమియం మార్కెట్ల్లో, పెరిగిన ఈఎంఐల కారణంగా ప్రభావితమైన వారికి, చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. తక్కువ రుణ ఖర్చులు ఆర్థిక అంచనాను మెరుగుపరచడమే కాక, కొనుగోలుదారుల విశ్వాసాన్ని కూడా బలోపేతం చేస్తాయి," అని ఆయన అన్నారు.
డెవలపర్లపై రూపాయి ప్రభావం..
అయితే, రియల్ ఎస్టేట్లోని ప్రతి ఒక్కరికీ ఈ ప్రభావం ఒకే విధంగా ఉండదు! ఆషార్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ హెడ్ ధర్మేంద్ర రైచూరా రూపాయి విలువ పడిపోవడం వల్ల డెవలపర్లు ఎదుర్కొంటున్న విభిన్న సవాలును ఎత్తి చూపారు.
"5.25%కి రేటు కోత గృహ కొనుగోలుదారుల స్థోమతకు తక్షణ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో బలమైన డిమాండ్కు, మెరుగైన విశ్వాసానికి దారితీస్తుంది. అదే సమయంలో, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకున్న నిర్మాణ సామగ్రి ఖరీదైనదిగా మారుతుంది. ఇది డెవలపర్ల మార్జిన్లకు ఒక సవాలు," అని ఆయన చెప్పారు.
అయినప్పటికీ, బలహీనమైన రూపాయి ఎన్ఆర్ఐల నుంచి డిమాండ్కు మద్దతు ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
"ఎన్ఆర్ఐలు, విదేశీ చెల్లింపుల ఆధారిత కొనుగోలుదారులకు, బలహీనమైన రూపాయి భారతీయ రియల్ ఎస్టేట్ను మరింత ఆకర్షణీయంగా, సరసమైనదిగా చేస్తుంది. విదేశీ-కరెన్సీ ఆదాయాలు ఉన్న కొనుగోలుదారులకు సేవలు అందిస్తూనే, ఖర్చుల ద్రవ్యోల్బణాన్ని తెలివిగా నిర్వహించే డెవలపర్లు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది," అని ఆయన అన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


