38 ఏళ్ల రోహిత్ శర్మ 50వ సెంచరీ- గంభీర్ రియాక్షన్ చూడాల్సిందే- కోహ్లి అదుర్స్- ఇండియా గ్రాండ్ విక్టరీ
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ తన పాత రోజులను గుర్తు చేస్తూ 33వ వన్డే సెంచరీని బాదాడు. ఇంటర్నేషన్ లో క్రికెట్లో రోహిత్ కు ఇది 50వ శతకం. హిట్ మ్యాన్ సెంచరీ తర్వాత కోచ్ గంభీర్ రియాక్షన్ వైరల్ గా మారింది. కోహ్లి కూడా అదరగొట్టడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది.
ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇదే నిజమని చాటాడు. తన 33వ వన్డే సెంచరీని బాదాడు. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలలో జరగనున్న 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగడానికి తనలో ఇంకా చాలా సత్తా ఉందని ఈ స్టార్ ఆటగాడు ప్రపంచానికి చాటిచెప్పాడు.

విరాట్ తో కలిసి
భారత మాజీ కెప్టెన్ రోహిత్ 33వ ఓవర్ చివరి బంతికి ఆడమ్ జంపా బౌలింగ్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను మరింత గుర్తుండిపోయేలా చేసింది ఏమిటంటే, అతని చిరకాల భాగస్వామి విరాట్ కోహ్లీ మరో ఎండ్లో ఉండటమే. 237 పరుగుల ఛేదనలో ఈ ఇద్దరు దిగ్గజాలు తమ పాత రోజులను గుర్తు చేస్తూ, అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ను గెలిపించారు.
కోచ్ రియాక్షన్
రోహిత్ శర్మ తన సెంచరీ అందుకున్నాక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్ గా మారింది. అతను నిలబడి చప్పట్లతో అభినందించాడు. దీంతో 2027 ప్రపంచకప్ లో రోహిత్ ఆడటం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
50వ సెంచరీ
33వ ఓవర్ పూర్తయిన తర్వాత డ్రింక్స్ కోసం వెళ్తున్నప్పుడు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ చిరునవ్వులు చిందించారు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ కు ఇది 50వ సెంచరీ. అంటే వన్డే, టెస్టు, టీ20ల్లో కలిపి సెంచరీల హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
ఈ సెంచరీతో ఆస్ట్రేలియాలో విదేశీ బ్యాటర్గా అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పుడు అతనికి ఆరు వన్డే శతకాలు ఉన్నాయి. కోహ్లీ, సంగక్కర నమోదు చేసిన ఐదు శతకాలను అతను అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది రోహిత్కు 50వ అంతర్జాతీయ శతకం. ఆస్ట్రేలియాపై హిట్మ్యాన్ నమోదు చేసిన 9వ వన్డే సెంచరీ ఇది.
విరాట్ రికార్డు
ఈ మ్యాచ్ లో కోహ్లీ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతను శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కరను అధిగమించి వన్డేలలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
గ్రాండ్ విక్టరీ
ఫస్ట్ రెండు వన్డేలో ఓడి సిరీస్ ను 0-2తో కోల్పోయిన భారత్ మూడో మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయింది. ముందు బౌలింగ్ లో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లతో రాణించారు. ఆసీస్ 236 పరుగులకే ఆలౌటైంది. రెన్ షా హాఫ్ సెంచరీ చేశాడు.
ఛేజింగ్ లో రోహిత్ శర్మ (125 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు) సూపర్ బ్యాటింగ్ తో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


