సాయి పేరెంటరల్స్ Q1 రాబడి రూ.182 కోట్లు.. విస్తరణ బాటలో కంపెనీ
ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.182.4 కోట్ల కన్సాలిడేటెడ్ రాబడిని నమోదు చేసింది. ఐపీఓ నిధుల వినియోగంలో మార్పులు చేస్తూ గుమ్మడిదల, జీనోమ్ వ్యాలీ ప్రాంతాల్లో కీలక విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ 2026 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1 FY27) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి రూ.182.4 కోట్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే కార్యకలాపాలు వేగవంతమవ్వడమే కాకుండా, వ్యూహాత్మక కొనుగోళ్లతో కంపెనీ తన ఉనికిని మరింత బలపరుచుకుంటోంది.

కంపెనీ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో స్థూల లాభం రూ.76.2 కోట్లుగా (41.8% మార్జిన్) నమోదైంది. గత నాలుగో త్రైమాసికంలో ఉన్న 38.1 శాతం స్థూల మార్జిన్తో పోలిస్తే ఇది 370 బేసిస్ పాయింట్లు పెరిగింది. కంపెనీ EBITDA రూ.27.3 కోట్లకు (14.9% మార్జిన్) పెరగ్గా , పన్నుల తర్వాతి నికర లాభం (PAT) రూ.7.9 కోట్లను తాకింది. ముడిసరుకుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి చేసిన ఒప్పందాల సవరణలు కంపెనీకి కలసివచ్చాయి.
మరోవైపు, స్టాండ్అలోన్ ప్రాతిపదికన సాయి పేరెంటరల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. స్టాండ్అలోన్ రాబడి రూ.56.2 కోట్లుగా నమోదై, ఏడాది ప్రాతిపదికన 174.8 శాతం వృద్ధిని సాధించింది. నికర లాభం ఏకంగా 975.1 శాతం ఎగబాకి రూ.8.9 కోట్లకు చేరింది.
IPO నిధుల వినియోగంలో మార్పులు.. కీలక కొనుగోళ్లు
వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు సాయి పేరెంటరల్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధుల వినియోగంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. రూ.83.83 కోట్ల తయారీ సామర్థ్యం విస్తరణ నిధులను, రూ.18.02 కోట్ల పరిశోధన నిధులను రెండు నూతన ఫార్మా కంపెనీల కొనుగోలుకు మళ్లించాలని నిర్ణయించారు.
- గుమ్మడిదలలో నూతన ఇంజెక్టబుల్ ప్లాంట్ నిర్మాణం కోసం సాయికృతి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో 60 శాతం ఈక్విటీ వాటాను రూ.83.83 కోట్లతో కొనుగోలు చేయనున్నారు.
- ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.215 కోట్లు కాగా , 15,000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం సాగుతోంది.
- జీడిమెట్లలోని యూనిట్ 1, 2 స్థలాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోకి రావడం , అక్కడ విస్తరణకు అనుమతులు లేకపోవడంతో గుమ్మడిదలలో పెద్ద ప్లాంట్ వైపు మొగ్గు చూపారు.
- కొత్త ప్లాంట్ ద్వారా వార్షికంగా 154.66 మిలియన్ యూనిట్ల ఇంజెక్టబుల్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇది పాత ప్రణాళిక కంటే 47 శాతం అధికం.
- ఆర్అండ్డీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు జీనోమ్ వ్యాలీలోని ప్రత్యాక్ ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 60 శాతం వాటాను రూ.18.02 కోట్లతో సాయి పేరెంటరల్స్ సబ్సిడీ సంస్థ అయిన SP అనలిటిక్స్ కొనుగోలు చేయనుంది.
- ఈ ఒప్పందం 2026 సెప్టెంబర్ 30 నాటికి పూర్తి కానుంది.
ఆస్ట్రేలియా, అమెరికా మార్కెట్లలో విస్తరణ
ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో నిర్మాణంలో ఉన్న AUD 53 మిలియన్ల ప్రాజెక్టుకు అవసరమైన చివరి విడత నిధుల సేకరణ పూర్తయింది. 2027 జనవరి నాటికి భౌతిక నిర్మాణం పూర్తి చేసి, ఏప్రిల్ 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అంతేకాకుండా, అమెరికా మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వీలుగా సింగపూర్ సబ్సిడీ సంస్థ ద్వారా అమెరికాలో కొత్త సబ్సిడీ సంస్థను ఏర్పాటు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
రూ.750 కోట్ల వార్షిక లక్ష్యం
ఫలితాలపై మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కరుసాల స్పందిస్తూ .. "ద్వితీయార్థంలో ఆర్డర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్ల రాబడి, 17 శాతం EBITDA మార్జిన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నాం" అని తెలిపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


