సెబీ సీఏఎస్ సమీక్షతో దూసుకెళ్లిన గ్రో, ఏంజెల్ వన్, బీఎస్ఈ షేర్లు
క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) నిబంధనల పునఃపరిశీలనకు సెబీ మొగ్గు చూపడంతో శుక్రవారం ట్రేడింగ్లో బ్రోకింగ్ సంస్థలు, బీఎస్ఈ షేర్లు 8 శాతం వరకు ఎగబాకాయి. డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ విధానంలో త్వరలోనే మార్పులు చేయనున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించడమే ఇందుకు కారణం.
మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' తీసుకున్న కీలక నిర్ణయం దలాల్ స్ట్రీట్లో ఉత్సాహాన్ని నింపింది. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానంపై సమీక్ష జరిపి, త్వరలోనే సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామని సెబీ ప్రకటించడంతో శుక్రవారం (సెప్టెంబర్ 4) ట్రేడింగ్లో బ్రోకింగ్ కంపెనీలతో పాటు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) షేర్లు భారీగా లాభపడ్డాయి.

ఏ ఏ షేర్లు ఎంతెంత పెరిగాయి?
ఎన్ఎస్ఈలో జరిగిన శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఏంజెల్ వన్ షేరు విలువ ఏకంగా 8 శాతం వరకు దూసుకెళ్లింది. దీనికి తోడు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) షేర్లు 5 శాతం లాభపడగా, బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ (గ్రో) షేర్లు దాదాపు 3 శాతం మేర పుంజుకున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు 3 శాతం, నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 1 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి.
సీఏఎస్ నిబంధనలపై సెబీ స్పష్టత
స్టాక్ మార్కెట్లో ఈక్విటీ క్యాష్ విభాగంలో షేర్ల ముగింపు ధరలను ఖరారు చేసేందుకు 2026 ఆగస్టు 3 నుంచి క్లోజింగ్ ఆక్షన్ సెషన్ను సెబీ ప్రవేశపెట్టింది. అయితే, ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీలు, బ్రోకర్లు, సాఫ్ట్వేర్ వెండర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్పీఐలు తదితర వాటాదారుల నుంచి వస్తున్న అభిప్రాయాలను సెబీ నిశితంగా పరిశీలిస్తోంది.
ప్రత్యేకించి డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున సీఏఎస్ ద్వారా నిర్ధారించే ముగింపు ధర ఆధారంగానే సెటిల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడంపై మార్కెట్ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అనుభవాలు, వాటాదారుల సలహాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ, డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ ధరల నిర్ణయాత్మక విధానంలో మార్పులు ప్రతిపాదిస్తూ వారంలోగా సంప్రదింపుల పత్రాన్ని (కన్సల్టేషన్ పేపర్) వెలువరించనున్నట్లు వెల్లడించింది.
మార్కెట్లో హెచ్చుతగ్గులు.. ట్రేడర్ల కలవరం
సీఏఎస్ విధానం ప్రకారం ట్రేడింగ్ ముగిసే చివరి 15 నిమిషాల్లో వచ్చే కొనుగోలు, విక్రయ ఆర్డర్లను సమన్వయం చేసి ముగింపు ధరను నిర్ణయిస్తారు. అయితే ఈ విధానం వల్ల ఎక్స్పైరీ రోజుల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గురువారం బీఎస్ఈ ఎక్స్పైరీ సమయంలో తొలి 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ ఏకంగా 2,100 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత కోలుకుని చివరికి 417 పాయింట్ల నష్టంతో 76,152.86 వద్ద ముగిసింది.
"ఆగస్టు 3న సీఏఎస్ ప్రారంభమైనప్పటి నుంచి డెరివేటివ్స్ సెటిల్మెంట్ కోసం వాడే ధర లైవ్ ట్రేడింగ్ ధర కాదు. మార్కెట్ ముగిసే ముందు 10-15 నిమిషాల వ్యవధిలో ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ ఆగిపోయినా, ఇండెక్స్ డెరివేటివ్స్లో ట్రేడింగ్ సాగుతూనే ఉంటుంది. ఆ సమయంలో తెరపై కనిపించే ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే తప్ప అది నిజమైన లావాదేవీ ధర కాదు. కానీ డెరివేటివ్స్ దానికి అనుగుణంగానే సెటిల్ అవుతున్నాయి" అని విట్రెండర్ వ్యవస్థాపకుడు షాయ్ కోయెల్హో విశ్లేషించారు.
భవిష్యత్తు దిశగా అడుగులు
మార్కెట్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలు, తీవ్ర అస్థిరతను నివారించేందుకు సెబీ వేగంగా స్పందించడంపై పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత మార్పులతో మార్కెట్లలో మళ్లీ పారదర్శకత, స్థిరత్వం వస్తాయన్న నమ్మకంతో బ్రోకింగ్ సంస్థల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


