షిప్‌రాకెట్ ఐపీవో మెరుపులు.. 34% ప్రీమియంతో లిస్టింగ్ అయ్యే సంకేతాలు

షిప్‌రాకెట్ ఐపీవో షేర్ల కేటాయింపు (Allotment) ప్రక్రియ పూర్తయి వివరాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రే మార్కెట్‌లో 34 శాతం దాకా ప్రీమియం పలుకుతుండటంతో బుధవారం జరగబోయే లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

Published on: Aug 18, 2026, 15:06:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ వేదిక 'షిప్‌రాకెట్' పబ్లిక్ ఇష్యూలో (IPO) షేర్ల కేటాయింపు కోసం నిరీక్షిస్తున్న ఇన్వెస్టర్లకు శుభవార్త. ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షేర్లు పొందిన అదృష్టవంతులకు రేపటి (ఆగస్టు 19, 2026) లిస్టింగ్ రోజున భారీ లాభాలు దక్కవచ్చని గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సంకేతాలు ఇస్తోంది.

షిప్‌రాకెట్ ఐపీవో మెరుపులు.. 34% ప్రీమియంతో లిస్టింగ్ అయ్యే సంకేతాలు
షిప్‌రాకెట్ ఐపీవో మెరుపులు.. 34% ప్రీమియంతో లిస్టింగ్ అయ్యే సంకేతాలు

అలాట్‌మెంట్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఐపీవోకి దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు నేరుగా ఆన్‌లైన్‌లోనే తమ అలాట్‌మెంట్ వివరాలను తెలుసుకోవచ్చు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా ఈ ఐపీవో రిజిస్ట్రార్ సంస్థ అయిన కెఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) అధికారిక పోర్టళ్ల ద్వారా స్టేటస్ పరిశీలించవచ్చు.

  • బిఎస్ఈ అధికారిక లింక్ https://bseindia.com/investors/appli_check ద్వారా లేదా కెఫిన్ టెక్నాలజీస్ లింక్ ipostatus.kfintech.com ద్వారా లాగిన్ అవ్వాలి.
  • అనంతరం పాన్ (PAN) నంబర్ లేదా అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసి క్షణాల్లో అలాట్‌మెంట్ స్టేటస్‌ను చూడవచ్చు.

గ్రే మార్కెట్‌లో రూ.33 ప్రీమియం

ఇన్వెస్టర్‌గేన్ నివేదికల ప్రకారం, గ్రే మార్కెట్‌లో షిప్‌రాకెట్ షేర్లు ఈరోజు రూ. 33 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఐపీవో గరిష్ఠ ధర బ్యాండ్ అయిన రూ. 97తో పోలిస్తే ఇది దాదాపు 33 నుంచి 34 శాతం అధికం. ఈ లెక్కన మంగళవారం నాటి జీఎంపీని బట్టి చూస్తే, ఈ షేరు దాదాపు రూ. 130 (రూ. 97 + రూ. 33) వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ సూచిస్తోంది.

ద్వితీయ శ్రేణి (సెకండరీ) మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ, గత వారంలో షిప్‌రాకెట్ జీఎంపీ స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం కనిపిస్తున్న జీఎంపీ కనీస రాబడిని మాత్రమే సూచిస్తోందని, మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడితే లిస్టింగ్ రోజున మరిన్ని లాభాలు రావచ్చునని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

నిపుణుల హెచ్చరిక.. ఆర్థిక గణాంకాలే ముఖ్యం

అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అనేది లిస్టింగ్ లాభాలకు పూర్తి స్థాయి కొలమానం కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీఎంపీకి కంపెనీ బ్యాలెన్స్ షీట్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు.

"కేవలం గ్రే మార్కెట్ ట్రెండ్స్ చూసి ఆశపడొద్దు, పెట్టుబడి పెట్టేటప్పుడు కంపెనీ ఆర్థిక బలాబలాలను పరిశీలించి తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలి" అని స్టాక్ మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు సూచించారు.

రేపే స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్

ఈ ఐపీవో 'T+3' నిబంధనల ప్రకారం ఆగస్టు 19, 2026న బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం ఇష్యూ దాదాపు 100 రెట్లకు పైగా (99.3-102.2 రెట్లు) సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్ విశ్లేషకులు, బ్రోకింగ్ సంస్థలు తెలిపిన వివరాలను ఇక్కడ అందించాం. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలైనా తీసుకునే ముందు నమోదిత ఆర్థిక సలహాదారులను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More