...
...
Next Story

వెండి ధరల భారీ పతనం: 45 శాతం పడిపోయిన రేట్లు.. ఇప్పుడు కొనడం సేఫేనా?

వెండి ధరలు కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే 45% మేర కుప్పకూలాయి. 2026 ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరైపోయాయి. ఈ భారీ పతనానికి కారణాలేంటి? నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న సలహా ఏమిటో ఈ కథనంలో చదవండి.

Published on: Feb 6, 2026, 15:04:35 IST
Advertisement

గత కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన వెండి, ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2026 ఆరంభంలో అంచనాలకు మించి రాణించిన ఈ శ్వేత లోహం, ప్రస్తుతం విక్రయాల వెల్లువతో బేజారవుతోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయి, ఈ ఏడాది వచ్చిన లాభాలన్నింటినీ తుడిచిపెట్టేశాయి.

రికార్డు స్థాయి నుంచి నేలచూపులు

వెండి ధరల భారీ పతనం: 45 శాతం పడిపోయిన రేట్లు (AFP)
వెండి ధరల భారీ పతనం: 45 శాతం పడిపోయిన రేట్లు (AFP)

జనవరి 2026 వరకు వెండి ధరలు కిలోకు 4.20 లక్షల పైన పలికి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అటు పారిశ్రామికంగా, ఇటు సురక్షిత పెట్టుబడిగా వెండికి ఉన్న ఆదరణే దీనికి కారణం. అయితే, తాజా పతనంతో మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర ఒకే రోజు 14,628 తగ్గి 2,29,187 కనిష్ట స్థాయికి చేరుకుంది.

కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే వెండి ఏకంగా 45.6% పతనం కావడం గమనార్హం. ఇదే సమయంలో బంగారం ధరలు తమ గరిష్ట స్థాయి నుంచి కేవలం 17.35% మాత్రమే తగ్గాయి. అంటే బంగారం కంటే వెండి రెండు రెట్లు వేగంగా పతనమైంది.

ఇంత భారీగా ఎందుకు తగ్గుతోంది?

వెండి ధరలు ఇంత వేగంగా ఎందుకు కుప్పకూలుతున్నాయనే అంశంపై 'ఛాయిస్ వెల్త్' రీసెర్చ్ హెడ్ అక్షత్ గార్గ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

"వెండి స్వభావరీత్యా బంగారం కంటే ఎక్కువ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. వెండి మార్కెట్ పరిమాణం చిన్నది కావడంతో అమ్మకాలు మొదలైనప్పుడు పతనం చాలా వేగంగా ఉంటుంది. గత ఏడాది కాలంలో ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ)కు మొగ్గు చూపుతున్నారు. డాలర్ బలపడటం కూడా దీనిపై ఒత్తిడి పెంచుతోంది." అని అక్షత్ గార్గ్ వివరించారు.

ధరలు తగ్గుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోనాంజా సీనియర్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.

"సుదీర్ఘ ర్యాలీ తర్వాత ఇలాంటి దిద్దుబాట్లు (Corrections) సహజం. అంతర్జాతీయంగా వెండికి పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత కూడా ఉంది. కాబట్టి దీర్ఘకాలంలో వెండి మళ్ళీ పుంజుకుంటుంది. ఒకరోజు తగ్గుదలను చూసి ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాలిక లక్ష్యాలను మార్చుకోవద్దు" అని నిర్పేంద్ర యాదవ్ సూచించారు.

నిపుణుల సలహా: ఇప్పుడు ఏం చేయాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి:

  • ఒకేసారి వద్దు: వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టకూడదు. దశలవారీగా (Staggered Buying) కొనుగోలు చేయడం మంచిది.
  • పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్: వెండిని ప్రధాన పెట్టుబడిగా కాకుండా, మీ పోర్ట్‌ఫోలియోలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉంచుకోవాలి.
  • నిబ్బరం అవసరం: స్వల్పకాలిక ట్రేడర్లు రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించాలి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా వేచి చూడటం ఉత్తమం.

వెండి ధరల పతనం అనేది మార్కెట్ సర్దుబాటులో భాగమే తప్ప, వెండి ప్రాధాన్యత తగ్గిపోవడం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe