క్రికెట్ చరిత్రలో తొలిసారి! IND vs SA మ్యాచ్లో లంచ్ బ్రేక్ కన్నా ముందు టీ!- ఎందుకు?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో టెస్ట్లో లంచ్ కంటే ముందే టీ బ్రేక్ తీసుకోనున్నారు! ఇలా జరగడం టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి! ఎందుకు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఒక అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించనుంది! సాధారణంగా టెస్ట్ మ్యాచ్లో ముందు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత టీ బ్రేక్ వస్తుంది. కానీ ఈ మ్యాచ్లో లంచ్ బ్రేక్ కంటే ముందే టీ బ్రేక్ తీసుకుంటారు! దీనికి కారణం ఏంటి?

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా- గువాహటిలో..
గువాహటి వేదికపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్తో గువాహటి దేశంలో 30వ టెస్ట్ వేదికగా నిలిచింది. కానీ నిర్వాహకులకు బ్యాట్-బాల్ కంటే కూడా సూర్యుడితో పోరాడటమే పెద్ద సవాలుగా మారింది!
భారతదేశంలో సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, గువాహటిలో తొలిసారిగా ఈ సంప్రదాయం బ్రేక్ అయింది! ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమైంది.
గతంలో వర్షం కారణంగా ఓవర్లు కోల్పోయినప్పుడు కొన్నిసార్లు 8:30 గంటలకు మ్యాచ్లు ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి.
కానీ, క్రికెట్కి ఉన్న 148 ఏళ్ల చరిత్రలో టీ బ్రేక్ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకోవడం ఇదే మొదటిసారి.
మార్పు ఎందుకు? కారణాలు ఏమిటి?
గువాహటి దేశానికి తూర్పున ఉంది. అందువల్ల, భారతదేశంలోని ఇతర వేదికలతో పోలిస్తే ఇక్కడ త్వరగా చీకటి పడిపోతుంది. సాయంత్రం వెలుతురు సరిగా లేకపోవడం కారణంగా ఓవర్లను కోల్పోకుండా ఉండేందుకు, మ్యాచ్ అధికారుల బ్రేక్ల క్రమాన్ని మార్చారు.
గువాహటిలో త్వరగా సూర్యోదయం, సూర్యాస్తమయం ఎందుకు?
భౌగోళికంగా, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెరిడియన్ 82.5°ఈ వద్ద ఉండగా, గువాహటి సుమారు 90°ఈ రేఖాంశం వద్ద ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే ఐఎస్టీని అనుసరించినప్పటికీ, భారతదేశంలోని ఈ భాగంలో ఇతర వేదికల కంటే సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా జరుగుతాయి.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా 2వ టెస్ట్ సమయాలు- బ్రేక్లు..
మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి 11:00 వరకు
టీ బ్రేక్ ఉదయం 11:00 నుంచి 11:20 వరకు
రెండవ సెషన్ ఉదయం 11:20 నుంచి 1:20 వరకు
లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 1:20 నుంచి 2:00 వరకు
మూడవ సెషన్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 వరకు
90 ఓవర్ల కోటను పూర్తి చేయడానికి, వెలుతురు సరిగా ఉన్న పక్షంలో అంపైర్లు రోజు చివరిలో మరో 30 నిమిషాలు అదనంగా జోడించవచ్చు!
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా- రెండో టెస్ట్..
మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక సిరీస్లో మిగిలింది ఈ ఒక్క మ్యాచే! టాస్ ఓడిన టీమిండియా బౌలింగ్కి దిగింది. శుభ్మాన్ గిల్ అనారోగ్యం కారణంగా దూరమవ్వడంతో, పంత్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


