ఈ సిగ్గు లేని వాళ్లు మీ విజయాన్ని వాడుకుంటున్నారు: వరల్డ్ కప్ గెలిచిన వుమెన్స్ టీమ్‌కు గవాస్కర్ వార్నింగ్

వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. వాళ్ల విజయాన్ని వాడుకుంటూ తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్న వారిపై అతడు మండిపడ్డాడు.

Published on: Nov 10, 2025 3:51 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ చరిత్రలో నవంబర్ 2వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరిగ్గా ఆరోజే భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారిగా మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఈ అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ విజయాన్ని కొందరు సిగ్గులేని వాళ్లు వాడుకుంటున్నారంటూ తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం.

ఈ సిగ్గు లేని వాళ్లు మీ విజయాన్ని వాడుకుంటున్నారు: వరల్డ్ కప్ గెలిచిన వుమెన్స్ టీమ్‌కు గవాస్కర్ వార్నింగ్ (HT Photos)
ఈ సిగ్గు లేని వాళ్లు మీ విజయాన్ని వాడుకుంటున్నారు: వరల్డ్ కప్ గెలిచిన వుమెన్స్ టీమ్‌కు గవాస్కర్ వార్నింగ్ (HT Photos)

సెలబ్రేషన్స్, అవార్డులపై జాగ్రత్త

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ సభ్యులు వరల్డ్ కప్ విజయంతో ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ అద్భుత విజయంతో ఐసీసీ నుంచి వచ్చిన రూ. 40 కోట్ల ప్రైజ్ మనీకి అదనంగా.. బీసీసీఐ ఏకంగా రూ. 51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ వంటి ఆటగాళ్లకు వ్యక్తిగత అవార్డులను ఖరారు చేశాయి.

అయితే ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ అమ్మాయిలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. వారి అంచనాలను అతిగా పెంచుకోవద్దని అతడు సూచించాడు. “ఈ అమ్మాయిలకు నాదొక మాట. దయచేసి మీకు ప్రకటించిన కొన్ని అవార్డులు అందకపోతే నిరాశ పడకండి. ఇండియాలో అడ్వర్టైజర్లు, బ్రాండ్‌లు, వ్యక్తులు ఈ విజయాన్ని ఉపయోగించుకొని ఉచిత పబ్లిసిటీ పొందడానికి త్వరగా ముందుకు దూకుతారు.

జట్టును అభినందిస్తూ ఇచ్చిన పూర్తి పేజీ ప్రకటనలు, హోర్డింగ్‌లను చూడండి. వారు జట్టు స్పాన్సర్లు లేదా వ్యక్తిగత ఆటగాళ్ల స్పాన్సర్లు కాకపోతే, మిగిలిన వారందరూ కేవలం తమ బ్రాండ్‌లను లేదా తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప భారత క్రికెట్‌కు కీర్తి తెచ్చిన వారికి ఏమీ ఇవ్వడం లేదు” అని గవాస్కర్ మిడ్-డే కోసం రాసిన తన కాలమ్‌లో పేర్కొన్నాడు.

గవాస్కర్ వ్యక్తిగత అనుభవం

గవాస్కర్ ఈ హెచ్చరిక చేయడానికి అతని వ్యక్తిగత అనుభవమే కారణం. 1983 ప్రపంచకప్ విజయం తర్వాత తనకు, తన సహచరులకు ఇచ్చిన అసంపూర్తి వాగ్దానాలను 'లిటిల్ మాస్టర్' గుర్తు చేసుకున్నాడు. అన్ని ప్రశంసలు దక్కినప్పటికీ, అప్పట్లో ప్రకటించిన అనేక అవార్డులు ఇప్పటికీ వారికి అందలేదు.

అయినప్పటికీ గవాస్కర్.. తాను, తన సహచరులు అభిమానుల నుండి పొందిన ప్రేమ, ఆప్యాయత గురించి గర్వపడ్డాడు. "1983 జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారు. మీడియాలో విస్తృతంగా కవరేజ్ వచ్చింది. కానీ దాదాపు అన్నీ కార్యరూపం దాల్చలేదు. మీడియాను నిందించలేం. ఎందుకంటే వారు గొప్ప ప్రకటనలను ప్రచురించడానికి సంతోషిస్తారు. ఈ సిగ్గులేని వ్యక్తులు వారినీ వాడుకుంటున్నారు. కాబట్టి అమ్మాయిలూ.. ఈ సిగ్గులేని వాళ్లు మీ విజయాన్ని తమను తాము ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటే మీరు బాధపడకండి” అని గవాస్కర్ జోడించాడు.

“1983 బ్యాచ్ మీకు చెబుతుంది.. ఇన్ని దశాబ్దాలు గడిచినా సామాన్య భారత క్రికెట్ ప్రేమికుడి ప్రేమ, అభిమానమే మా గొప్ప సంపద. మీరు కూడా విశ్రాంతి తీసుకునే సమయంలో అదే మీకూ గొప్ప సంపద అవుతుంది. హృదయపూర్వక అభినందనలు మరోసారి. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. జై హింద్” అని గవాస్కర్ ముగించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More