...
...
Next Story

ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను నిరోధించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన నిబంధనలను అమలు చేయడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐటీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

Published on: Aug 18, 2026, 12:15:56 IST
Advertisement

ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపులు, అబ్యూజ్ మెటీరియల్ (CSEAM) వ్యాప్తిని అడ్డుకోవడంలో సోషల్ మీడియా సంస్థలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో సామాజిక మాధ్యమాలు విఫలమవుతుండటంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

నెట్‌వర్క్ దిగ్గజాలు తమ వేదికలపై జరిగే బాలల లైంగిక నేరాల సమాచారాన్ని భారతీయ చట్ట అమలు సంస్థలకు నివేదించడం లేదని, అలాగే నేరస్థుల వివరాలను 'నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్' (NDSO)లో తక్షణమే అప్‌లోడ్ చేయడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీవ్రమైన అంశంపై విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాలల హక్కుల కోసం పనిచేస్తున్న 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలియన్స్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు, ఈ రెండు మంత్రిత్వ శాఖలను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించింది. సెప్టెంబరు 24 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అంతకంటే రెండు వారాల ముందే పిటిషనర్లకు దాని ప్రతులను అందించాలని స్పష్టం చేసింది.

పెయిడ్ యాడ్స్.. ఇతర సైట్లకు రీడైరెక్ట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే విధంగా పెయిడ్ ప్రకటనలు ఇస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రకటనల ద్వారా వినియోగదారులను ఇతర వెబ్‌సైట్లు లేదా యాప్‌లకు రీడైరెక్ట్ చేసి, డబ్బులు వసూలు చేస్తూ లైంగిక కంటెంట్‌ను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అడ్వర్టైజ్‌మెంట్ స్క్రీనింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

"సమాచార సాంకేతికత (IT) చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే 'సేఫ్-హార్బర్' మినహాయింపులు సోషల్ మీడియా వేదికలకు ఊరికే రావు. ఐటీ నిబంధనలతో పాటు పోక్సో (POCSO) చట్టంలోని నిర్బంధ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ఆ చట్టపరమైన రక్షణ వర్తిస్తుంది" అని 2024 సెప్టెంబరు 23న తాము ఇచ్చిన కీలక తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సోషల్ మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks